ఉద్రిక్తతల నడుమ పాత జీపీ బిల్డింగ్ కూల్చివేత..మన్నెంపల్లిలో టెన్షన్ టెన్షన్

ఉద్రిక్తతల నడుమ పాత జీపీ బిల్డింగ్ కూల్చివేత..మన్నెంపల్లిలో టెన్షన్ టెన్షన్
  • సర్పంచ్ భర్త​ అరెస్ట్
  •     సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​మండలం మన్నెంపల్లి గ్రామంలోని పాత గ్రామ పంచాయతీ భవనం కూల్చివేత తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. భవనాన్ని కూల్చేందుకు శనివారం ఉదయం అధికారులు పోలీసు బందోబస్తు నడుమ గ్రామానికి చేరుకోగా.. బిల్డింగ్​ను కూల్చవద్దని సర్పంచ్ పొన్నం సునీత, ఆమె భర్త అనిల్ గౌడ్ అడ్డుకున్నారు. పాత భవనాన్ని ఇతర కార్యకలాపాలకు వాడుకునేలా జీపీ తీర్మానించిందని, దాన్ని ఎలా కూలుస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బిల్డింగ్ శిథిలావస్థలో ఉందని, డిజైన్ సరిగా లేదని, భీములపై వెయిట్ పడుతోందని ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం కూల్చేందుకు కలెక్టర్ ఆదేశాలిచ్చారని, కూల్చాల్సిందేనని అధికారులు పట్టుబట్టారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి, తమ పాలకవర్గం తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ సునీత మండిపడ్డారు. 

భర్త స్టేషన్​కు తరలింపు.. భార్య త్మహత్యాయత్నం

తీవ్ర ఉద్రిక్తల నడుమ సర్పంచ్ భర్త పొన్నం అనిల్ ను తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్  బలవంతంగా ఎల్ఎండీ పోలీస్ స్టేషన్​కు తరలించారు. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ సర్పంచ్ సునీత పోలీస్ వాహనానికి అడ్డుకోగా పోలీసులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఉద్వేగానికి లోనైన ఆమె పక్కనే ఉన్న కొత్త గ్రామ పంచాయతీ భవనంలోకి వెళ్లి తలుపులు పెట్టుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ సిబ్బంది తలుపులు నెట్టుకొని లోపలికి వెళ్లి పెట్రోల్​తో ఆత్మహత్యకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమక్షంలో సిబ్బంది పాత భవనాన్ని కూల్చివేశారు.