నేరడిగొండ, వెలుగు: ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగుల వేధింపులతో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలానికి చెందిన ఓ పోస్ట్మన్ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం సావర్గాం గ్రామానికి చెందిన జాదవ్ అనిల్(35) నాలుగేండ్లుగా కొరిటికల్-(బి) గ్రామంలో పోస్టుమన్గా పని చేస్తున్నాడు.
అతను ఓ ఎలక్ట్రానిక్ ఫైనాన్స్లో రూ. 20 వేలు, వాస్తు ఫైనాన్స్లో రూ.5 లక్షల లోన్ తీసుకున్నాడు. ఇటీవల అనిల్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావడంతో గత నెల ఈఎంఐ చెల్లించడం ఆలస్యమైంది. దీంతో ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది అతని ఇంటికి వెళ్లి ఈఎంఐ కట్టాలని ఒత్తిడి చేశారు.
శనివారం డ్యూటీలో భాగంగా సావర్గాం వెళ్తుండగా, మార్గమధ్యలో అటకాయించి అవమానించారు. వారి వేధింపులతో మనస్తాపానికి గురైన అనిల్ తన పాన్ షాపు వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడు. మృతుడి తండ్రి జాదవ్ కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు.
హైదరాబాద్లో గుండెపోటుతో ఆటో డ్రైవర్..
తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన సుతారపూర్ దామోదర్(30) శనివారం గుండెపోటుతో చనిపోయాడు. దామోదర్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులతోనే చనిపోయాడని మృతుడి తండ్రి వెంకన్న ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా కేంద్రంలోని పద్మ సాయి ఫైనాన్స్ లో లోన్ తీసుకొని ఆటో కొనుక్కొని హైదరాబాద్ లో నడుపుతున్నాడు. ఇటీవల గిరాకీలు లేకపోవడంతో ఈఎంఐ కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ ఓనర్లు దామోదర్ కు ఫోన్ చేసి ఈఎంఐ కట్టకపోతే ఆటోను లాక్కెళ్తామని వేధించగా, తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడు. తన కొడుకును వేధించిన ఫైనాన్స్ కంపెనీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
