హెచ్ఎండీఏ ప్లాట్స్ ఫర్ సేల్.. త్వరలో వేలం పాటలు

హెచ్ఎండీఏ ప్లాట్స్ ఫర్ సేల్.. త్వరలో వేలం పాటలు
  •  ల్యాండ్ పూలింగ్​ ద్వారా పెద్దమొత్తంలో భూముల సేకరణ
  • అభివృద్ధి చేసి లేఅవుట్స్ సిద్ధం చేసిన అధికారులు  
  • వేలం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
  • గ్రీన్​సిగ్నల్​ ఇవ్వగానే అమ్మకాలు షురూ

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహా నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవలే ప్లాట్ల వేలానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ఇవ్వగానే వేలం పాటలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఔటర్​రింగ్​రోడ్​కు ఇవతల, అవతల హెచ్ఎండీఏ పెద్దమొత్తంలో ల్యాండ్ పూలింగ్​ద్వారా రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసింది.

 ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పించి లేఅవుట్లు సిద్ధం చేసింది. రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేశాక అందులో 60 శాతం ఆయా రైతులకు ఇచ్చి, మిగిలిన 40 శాతం భూములను హెచ్ఎండీఏ తీసుకుంటోంది. ఇలా తీసుకున్న భూముల్లో వందల సంఖ్యలో ప్లాట్లు ప్రస్తుతం హెచ్ఎండీఏ వద్ద ఉన్నాయి. 

ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆర్థిక పరిస్ధితి దిగజారిపోవడంతో తన వద్ద ఉన్న భూములను వేలం వేయడం ద్వారా నిధులను సేకరించాలని నిర్ణయించింది. సేకరించిన నిధులతో ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎలివేటెడ్​కారిడార్​ప్రాజెక్టు, రేడియల్​రోడ్ల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు అవసరమైన నిధులు లేవు. ఈ నేపథ్యంలో భూములను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంపై అధికారులు దృష్టిపెట్టారు. 

గ్రేటర్​లో రియల్​ ఎస్టేట్​కు ఢోకాలేదు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో రియల్​ఎస్టేట్​స్తబ్దుగా ఉండగా, హైదరాబాద్ పరిధిలోనూ కొంత అదే పరిస్థితి ఉన్నది. అయినా హైదరాబాద్​లో రియల్​ఎస్టేట్​ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని, ఇక్కడి భూములకు ఢోకా ఉండదని అధికారులు భావిస్తున్నారు. ప్లాట్లను వేలం వేస్తే తప్పక మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్​రియల్​ రంగంలో భూములకు అధికంగానే గిరాకీ ఉంటుందని చెబుతున్నారు. త్వరలో వేలం వేయనున్న ప్లాట్లకు సంబంధించి కూడా గజం ధర రూ.25 నుంచి 30 వేలకు తగ్గదని అధికారులు భావిస్తున్నారు. దీని కన్నా ఎక్కువ వేలం పాటలో పాడే వారికి వాటిని అమ్మాలని నిర్ణయించారు.

కోకాపేటలోనూ..

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోకాపేటలోని నియోపోలిస్​ లేఅవుట్​లో గతంలో నిర్వహించిన వేలానికి ఎకరానికి వంద కోట్లు పలికింది. ఇందులో కూడా ప్రస్తుతం కొన్ని ప్లాట్లు వేలానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్లను అప్​సెట్​ప్రైస్​రూ.40 నుంచి 50 కోట్లు పలికే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బుద్వేల్​లో అభివృద్ధి చేసిన 18 లేఅవుట్లలో 2400 ప్లాట్లు అమ్మకాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 

వీటితో పాటు ఉప్పల్​భగాయత్, మోకిల, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల వేలం వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్​ సిగ్నల్ రాగానే భూముల వేలం ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. 

ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే

ఔటర్​కు అటు ఇటుగా వేల లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇన్ముల్​నర్వ, తొర్రూరు, లేమూరు, ప్రతాపసింగారం, మోకిల తదితర ప్రాంతాల్లో లేఅవుట్లు సిద్ధం చేసింది. లేమూరులో 83 ఎకరాలు రైతుల నుంచి సేకరించి అధికారులు అభివృద్ధి చేశారు. రోడ్లు, ప్రజావసరాలకు కొంత భూమి పోగా, మొత్తం 498 ప్లాట్లు ఉన్నాయి. 

ఇందులో 333 ప్లాట్లు రైతులకు పోగా, మిగిలిన 165 ప్లాట్లు హెచ్ఎండీఏ వద్దే ఉన్నాయి. త్వరలో వీటిని విక్రయించనున్నారు. తొర్రూరులో 117 ఎకరాల్లో అతిపెద్ద లేఅవుట్ సిద్ధం చేసింది. ఇందులో 985 ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో కొన్ని ఇప్పటికే అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం 393 ప్లాట్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రతాపసింగారం వద్ద హెచ్ఎండీఏ రైతుల నుంచి165 ఎకరాలు సేకరించింది. ఇందులో 1093 ప్లాట్లు రైతులకు పోగా, 793 ప్లాట్లు హెచ్ఎండీఏ వద్ద ఉన్నాయి.