స్కానింగ్ మెషీన్తోనే తప్పు జరిగిందన్న అధికారులు
నిర్మల్ టౌన్, వెలుగు: నిర్మల్ జిల్లా సారంగాపూర్ లోని వడ్ల అవుజయ్య అనే వ్యక్తి ఇంటికి రూ.21 కోట్లకు పైగా కరెంట్బిల్లు వచ్చింది. దీంతో అతడికి గుండె ఆగినంత పనైంది. బుధవారం కరెంట్బిల్లు కొట్టడానికి అవుజయ్య ఇంటికి వచ్చిన వ్యక్తి సర్వీస్ నంబర్ 6191200522 బిల్లు ఇచ్చి వెళ్లాడు. రూ.రెండు, మూడు వందల్లోపే వచ్చి ఉంటుందనుకున్న అవుజయ్య తనకు వచ్చిన బిల్లు చూసి షాక్ తిన్నాడు. అందులో రూ.21 కోట్ల 47 లక్షల 48 వేల 364 అని ఉండడంతో నివ్వెరపోయాడు. వెంటనే నిర్మల్లోని కరెంట్ ఆఫీస్ కు పరుగుతీశాడు. అధికారులకు చూపించగా వారూ ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకుని స్కానింగ్మెషీన్వల్లే తప్పు జరిగిందని తేల్చారు. లైన్ మెన్ తో మాట్లాడి మీటర్ రీడింగ్ పరిశీలించి బిల్లు మార్చాలని సూచించారు.