రెండోరోజూ అదే రద్దీ.. 3 లక్షలకు పైగా భక్తులకు స్వామి దర్శనం

రెండోరోజూ అదే రద్దీ.. 3 లక్షలకు పైగా భక్తులకు స్వామి దర్శనం

అయోధ్య/లక్నో: అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలొస్తు న్నారు. తొలిరోజు 5 లక్షల మంది రాముడి దర్శనం చేసుకోగా, బుధవారం రెండోరోజు 3 లక్షల మంది దర్శించుకున్నారు. రాముడి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు. భక్తుల రద్దీ కారణంగా రెండోరోజు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం క్యూలైన్లు పెంచామని, పరిస్థితి కంట్రోల్​లో ఉందని లాఅండ్ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ‘ఇప్పుడు భక్తుల రద్దీ ఏమీ లేదు. దర్శనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశాం. మరో ఎగ్జిట్ రూట్, పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం’ అని హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ చెప్పారు. ‘‘అయోధ్యకు వెళ్లే రోడ్లు మొత్తం వెహికల్స్ తో రద్దీగా మారాయి. భక్తుల రద్దీ నియంత్రణ కోసం సుల్తాన్ పూర్ నుంచి అయోధ్యకు బస్సులు నిలిపివేశాం” అని యూపీఎస్​ఆర్టీసీ ఆర్​ఎం నాగేంద్ర ప్రసాద్ పాండే పేర్కొన్నారు.

వీఐపీలు ముందుగానే చెప్పాలె..

భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లపై అధికారులతో సీఎం యోగి సమావేశం నిర్వహించారు. ‘రాముడి దర్శనం ప్రశాంతంగా జరిగేలా భక్తులకు ఏర్పాట్లు చేయండి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి’ అని సూచించారు. అయోధ్యకు వచ్చే వీఐపీలు ఒక వారం ముందుగానే ప్రభుత్వానికి లేదా ట్రస్టుకు సమాచారం ఇవ్వాలని సీఎం కోరారు.