బ్యాంక్ లో చోరీకి భార్యాభర్తల భారీ స్కెచ్

బ్యాంక్ లో చోరీకి భార్యాభర్తల భారీ స్కెచ్

హైదరాబాద్ : బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నించిన భార్యాభర్తలను సీసీటీవీ ఆధారంగా పట్టుకున్నారు పోలీసులు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. గచ్చిబౌలిలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భారీ దోపిడీకి యత్నించిన భార్యాభర్తలను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 6 కంప్యూటర్ల మానిటర్లు, ఒక డీవీఆర్‌, ఒక వీఐపీ ట్రావెల్‌ బ్యాగ్‌, ఒక టాటా ఏస్‌ ఆటో ట్రాలీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ మేనేజర్‌ గౌతంరెడ్డి చోరీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం,గూడూరు గ్రామానికిచెందిన భార్యాభర్తలు దైత భాస్కర్‌(26), అతని భార్య భవానీ(23) నగరంలోని గోపన్‌పల్లి తండా ఎన్‌టీఆర్‌లో నివాసముంటున్నారు. నిందితులు భాస్కర్‌, భవానీని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. దొంగిలించిన సామగ్రిని స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.