- పీఎం సూర్యఘర్ స్కీమ్ కింద కిలో వాట్కు రూ.18 వేలు సబ్సిడీ
- 500 కిలోవాట్ల వరకు రాయితీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గేటేడ్ కమ్యూనిటీలు సోలార్ విద్యుత్ వైపు దృష్టి సారించాయి. కమ్యూనిటీ పరిధిలో నివసించే కుటుంబ అవసరాల కోసం ఉపయోగించే కరెంటుకు చార్జీలు ఎక్కువమొత్తంలో ఉంటున్నాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి కమ్యూనిటీ సంఘాల ప్రతినిధులు.. ప్రభుత్వం అందించే సబ్సిడీని ఉపయోగించుకొని తమ గేటేడ్ కమ్యూనిటీ భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
పీఎం సూర్యఘర్ స్కీమ్ లో భాగంగా రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను నెలకొల్పుకుంటున్నారు. ఒక కిలోవాట్ కు రూ.18 వేల సబ్సిడీ వస్తుండటంతో తమ కమ్యూనిటీలోని కుటుంబాల స్థాయిలను బట్టి రూఫ్పై 500 కిలో వాట్స్ వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
ఇప్పటికే నగరంలోని 50కి పైగా గేటేడ్ కమ్యూనిటీల్లో ఇలాంటి సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయగా.. మరో 200 చోట్ల సోలార్ విద్యుత్ తయారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న గేటేడ్ కమ్యూనిటీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును బిల్డర్లు ప్రోత్సహిస్తున్నారు. దీంతో హైదరాబాద్లో ఆకాశహర్మ్యాలపై సోలార్ ప్యానెళ్లు జిగేల్ మంటున్నాయి.
రూఫ్టాప్ సోలార్ అంటే ఏమిటి?
ఇంటి భవనం పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సూర్యకాంతిని విద్యుత్గా మార్చే వ్యవస్థనే రూఫ్ టాప్ సోలార్ అంటారు. ఇది ముఖ్యంగా గ్రిడ్ -కనెక్టెడ్ (ఆన్-గ్రిడ్) సిస్టమ్గా ఉంటుంది. సోలార్ నుంచి వచ్చే విద్యుత్ను నెట్ మీటరింగ్ ద్వారా ముందు ఇంట్లో వాడుకుని, మిగిలిన దానిని విద్యుత్ గ్రిడ్కు అమ్మవచ్చు. రాత్రివేళ, మేఘావృతమైనప్పుడు గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకోవచ్చు. రాష్ట్రంలో 2018 నుంచి ఈ విధానం ప్రజాదరణ పొందింది.
ఎండలు ఎక్కువగా ఉండటంతో ఏటా300 రోజులు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకొని వినియోగించుకోవచ్చు. పీఎం సూర్య ఘర్ స్కీమ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచితం. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతోంది. సోలార్ ప్యానెళ్లకు 25, 30 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ 5 నుంచి 7 సంవత్సరాల్లోనే రికవరీ చేసుకోవచ్చు. మూడు కిలోవాట్ల వరకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ అందిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీలలో అయితే కిలోవాట్కు రూ.18 వేల చొప్పున 500 కిలోవాట్స్ వరకు సబ్సిడీ లభిస్తుంది.
రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పైగా ఖర్చు
గేటేడ్ కమ్యూనిటీస్ రూఫ్టాప్పై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.కోటి నుంచి రూ.5 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇందులో స్థాయిని బట్టి ప్రభుత్వం అందించే సబ్సిడీ పోగా మిగతా డబ్బులను ఓనర్స్ అసోసియేషన్ ఫండింగ్, బ్యాంక్ లోన్లు తీసుకుంటున్నారు. ఇలా నెలకు ఒక్కో కమ్యూనిటీలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కరెంట్ బిల్లులను తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే నగరంలో మై హోమ్ విహంగలో 500, మీనాక్షీ స్కై మంచ్లో 200, సుమధుర ఆక్రోపోలీస్ అపార్ట్మెంట్స్లో 295, క్రూజ్ అండ్ హైట్స్, అశోకలో 120 చొప్పున కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగిస్తున్నారు.
నగరవ్యాప్తంగా గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ, వంటి ఏరియాల్లో 50కి పైగా గేటేడ్ కమ్యూనిటీస్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని టీజీ రెడ్కో ఆఫీసర్లు చెబుతున్నారు. పీఎం సూర్యఘర్ స్కీమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 96.45 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రూ.174 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా అందించిందని తెలిపారు.
