హైదరాబాద్ కుల్సుంపురాలో 16 యేళ్ల బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. నవ్య అనే బాలిక రాత్రి ఇంట్లో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నవ్య క్షుద్ర పూజల వల్లే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఏమైందంటే..
జూన్ 1 గురువారం ఆమావాస్య రోజు నవ్య ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు కనిపించాయి. ఆ రోజు వాటిని చూసిన నవ్య తీవ్ర భయాందోళనలకు గురయ్యింది. కళ్ళు మూసినా తెరిచిన అవే కనబడుతున్నాయని నవ్య తమతో చెప్పేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిజానికి నవ్య చాలా ధైర్యవంతురాలు, చాలా యాక్టివ్ అని అంటున్నారు. అయితే ఇంటిముందు నిమ్మకాయలు, నల్లబొమ్మలు కనిపించడంతో భయపడిందని వెల్లడిస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్లడానికి కూడా తోడు రమ్మన్నదని వివరిస్తున్నారు. కొద్దిగా చీకటి పడినా..ఏవైనా నీడలు కనిపించినా భయపడిందంటున్నారు.
రెండో సారి నిమ్మకాయలు..నల్లబొమ్మలు..
జూన్ 7వ తేదీన బుధవారం మళ్లీ నవ్య వాకిట్లో నిమ్మకాయలు, కుంకుమ కనిపించాయి. వాటిని చూసిన నవ్య మరోసారి భయాందోళనకు గురైంది. నవ్యనే వాటిని ఇంటిముందు నుంచి ఊడ్చేసి, కాల్చేసింది. ఆ తర్వాత స్నానం చేసిన నవ్య కొద్దిసేపు కుటుంబ సభ్యులతో గడిపింది. నవ్య అక్క వంట చేస్తుండగా గుడ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఈ సమయంలో 5 నిమిషాల్లో వస్తా వంట గదిలో నుంచి మరో గదిలోకి వెళ్లిన నవ్య..అక్కడ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నవ్య రెండో అమ్మాయి. ఇంటర్ చదువుకుంటోంది. అయితే తమ అక్కాచెల్లెళ్లలో నవ్యనే చాలా ధైర్యవంతురాలని ఆమె అక్క చెబుతోంది.