రేపు భార్య శ్రీమంతం.. ఆత్మహత్య చేసుకున్న మెట్రో ఉద్యోగి

రేపు భార్య శ్రీమంతం.. ఆత్మహత్య చేసుకున్న మెట్రో ఉద్యోగి

కుటుంబ కలహాల కారణంగా మెట్రో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‍లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా, పెద్ద కందుకూరు విలేజ్‌కు చెందిన నరేష్(28) భార్యతో కలిసి సరస్వతి నగర్‌లో నివాసముంటూ మెట్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య గర్భవతి కాగా, రేపు శ్రీమంతం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది.

ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో కానీ, నరేష్ ఇవాళ(డిసెంబర్ 29) భార్యకి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ఉరి కొయ్యకు వేలాడుతున్న దృశ్యాలు లైవ్‌లో చూసినా.. ఆమె ఏమీ చేయలేకపోయింది. పక్కింటివారికి సమాచారం ఇచ్చి.. వారొచ్చి చూసేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. సమాచారం అందుకున్నఉప్పల్ పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.