కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

కంపు కొడుతున్న మున్సిపాలిటీలు

డ్రైనేజీ నిర్వహణలో అధ్వానం.. మంచినీళ్లు వచ్చేది 42 నిమిషాలే     హైదరాబాద్ మినహా మిగతా పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త

మున్సిపాలిటీలు కంపు కొడుతున్నాయి. హైదరాబాద్​ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ చెత్త, మురుగు నీటి నిర్వహణ దారుణంగా ఉంది. ఎక్కడికక్కడే చెత్త పారేస్తున్నారు. ఇటు తాగునీటి సరఫరా కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇది ఎవరో చెబుతున్న మాటలు కాదు. అడ్మినిస్ట్రేటివ్​ స్టాఫ్​కాలేజీ ఆఫ్​ ఇండియా (ఆస్కి) నిపుణులు సర్వే చేసి చెబుతున్న మాటలివి. ఆరు మున్సిపల్​ కార్పొరేషన్లు, 44 మున్సిపాలిటీలు, 23 థర్డ్​ గ్రేడ్​ మున్సిపాలిటీలపై ‘మున్సిపల్​ ఫైనాన్స్​ అండ్​ సర్వీస్​ డెలివరీ ఇన్​ తెలంగాణ’ పేరిట సర్వే చేసి ముసాయిదా నివేదికను రూపొందించింది. మంగళవారం ఆ నివేదికను ప్రభుత్వానికి ఆస్కి సమర్పించింది. కొత్తగా ఏర్పాటైన 68 మున్సిపాలిటీలను మాత్రం ఈ సర్వేలో చేర్చలేదు. తాగునీటి సరఫరా, మురుగు నీరు–డ్రైనేజీ– ఘన వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక పరిస్థితి, క్రెడిట్​ రేటింగ్​, సిబ్బంది పనితీరు, అకౌంట్స్​, ఆడిట్​ నివేదికలను పరిశీలించి ఈ డ్రాఫ్ట్​ రిపోర్టును తయారు చేశారు.

నల్లా నీటి సరఫరా అధ్వానం
మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని ఆస్కి సర్వేలో గుర్తించింది. నీటి సరఫరా, మీటర్ల ఏర్పాటు కేవలం 2.8 శాతమే ఉందని పేర్కొంది. రోజుకు సగటున 42 నిమిషాలే నీళ్లొస్తున్నాయని తెలిపింది. ఆరు మున్సిపాలిటీలు మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్య, మురుగునీటి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉందని వెల్లడించింది. జీహెచ్​ఎంసీలో ఎక్కువగా 87% వరకు డ్రైనేజీ వ్యవస్థ ఉండగా, కరీంనగర్​లో తక్కువగా 3 శాతమే ఉంది. హైదరాబాద్​లోని​ మీర్​పేట్​ పరిధిలో ఎక్కువగా 96 శాతం మేర డ్రైనేజీ వ్యవస్థలున్నాయని చెప్పింది. 2011లో మున్సిపాలిటీల్లో మురుగునీటి కాల్వలు పరిధి సగటున 25 శాతమే ఉండగా, 2017 నాటికి 57 శాతానికి పెరిగినట్టు చెప్పారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు కాల్వల వ్యవస్థ రాష్ట్రంలో 38 శాతం మాత్రమే ఉంది. 90 శాతం ఇళ్ల నుంచి 89 శాతం చెత్తను సేకరిస్తున్నా, తడి, పొడి చెత్తను వేరు చేయడం లేదని నివేదికలో ఆస్కి పేర్కొంది. కేవలం 10 శాతమే జరుగుతున్నట్టు తేల్చింది. హైదరాబాద్​ మినహా అన్ని మున్సిపాలిటీల్లోనూ అశాస్త్రీయ పద్ధతుల్లోనే చెత్తను పారబోస్తున్నట్టు వివరించింది.

55% ఖర్చులు నిర్వహణకే
మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆస్కి నివేదిక స్పష్టం చేసింది. పన్నులు, పన్నేతర ఆదాయం 62% కాగా, రాష్ట్ర గ్రాంట్ల ద్వారా 20%, అసైన్డ్​ రెవెన్యూ ద్వారా 11%, కేంద్రం నుంచి 7% నిధులు వస్తున్నాయి. పన్నుల్లో 94% రాబడి ఆస్తి పన్ను ద్వారానే వస్తోంది. అయితే, ఐదేళ్లలో మొత్తం ఆదాయంలో 55% డబ్బును నిర్వహణకే ఖర్చు చేశారు. వచ్చే ఐదేళ్లలో జీహెచ్​ఎంసీ సహా 73 మున్సిపాలిటీల్లో అదనంగా ₹65,720 కోట్లు అవసరమవుతాయని ఆస్కి అంచనా వేసింది. ఇందులో రోడ్ల నిర్వహణ, నిర్మాణానికే ₹39 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పింది. తర్వాత తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, స్ట్రీట్​ లైట్ల ఏర్పాటుపై ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

ఆస్కి సిఫార్సులివీ
పన్నుల రాబడిని పెంచుకునేందుకు యుద్ధప్రాతిపదికన అసెస్డ్​, అన్​అసెస్డ్​​ప్రాపర్టీని గుర్తించి డేటా తయారు చేయాలి. అసెస్​మెంట్​ చేయని ఆస్తులను అసెస్​ చేసి ఆస్తి పన్నులు వసూలు చేయాలి. ఆస్తి పన్ను వసూలులో ఆలస్యాన్ని నివారించేందుకు రూల్స్​ మార్చాలి. పన్ను లేట్​గా చెల్లించే వారికి 2 శాతం వడ్డీతో జరిమానా విధించాలి. బ్యాంకులు, క్రెడిట్​ అండ్​ డెబిట్​ కార్డుల ద్వారా కూడా పన్నులు చెల్లించే సౌకర్యం కల్పించాలి. పన్ను వసూళ్లకు మున్సిపల్​ సిబ్బంది వార్డు సభలు నిర్వహించి ప్రచారం కల్పించాలి. స్టాంప్​ డ్యూటీ ఆదాయం క్రమం తప్పకుండా మున్సిపాలిటీ ఖాతాల్లో జమయ్యేలా చూడాలి. ప్రకటనల పన్నులు విధించేందుకు రూల్స్​ తయారు చేయాలి. ఖాళీ స్థలాలు, కేబుల్  ఆపరేటర్ల నుంచి పన్నులు వసూలు చేయాలి. ఒక్కో మున్సిపల్​ కమిషనర్​ కనీసం మూడేళ్లు ఒకే చోట పనిచేసేలా చూడాలి. మున్సిపాలిటీల బలోపేతానికి ఎప్పటికప్పుడు సూచనలు చేసేలా హైపవర్​ కమిటీని ఏర్పాటు చేయాలి. జమ, ఖర్చులపై ఎప్పటికప్పుడు ఆడిట్​ నిర్వహించాలి. ఆస్తుల అసెస్​మెంట్​, పన్ను నిర్ధారణకు తెలంగాణ మున్సిపల్​ రెవెన్యూ రెగ్యులరేటరీ కమిషన్​ ఏర్పాటు చేయాలి. ట్రేడ్​లైసెన్స్​ ఫీజుతో పాటు ప్రతి ఐదేళ్లకోసారి పన్ను విధింపును సమీక్షించాలి.