గొర్రెల స్కీమ్​ కేసులో కాంట్రాక్టర్​ అరెస్ట్​

గొర్రెల స్కీమ్​ కేసులో కాంట్రాక్టర్​ అరెస్ట్​
  • మొయినొద్దీన్​ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
  • కేసు నమోదు కావడంతో దుబాయ్​కి పరార్​
  • హైదరాబాద్​కు రాగానే ఇమ్మిగ్రేషన్ ​సహకారంతో అరెస్ట్​

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్  సర్కారు హయాంలో జరిగిన గొర్రెల స్కీమ్ స్కామ్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది.  ఈ కేసులో గత ఏడాదిన్నర కాలంగా తప్పించుకు తిరుగుతున్న కాంట్రాక్టర్ ఖాజా మొయినొద్దీన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్​కు వచ్చిన మొయినొద్దీన్ ను గురువారం రాత్రి కోకాపేట్ మూవీ టవర్ లో అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. గొర్రెల స్కీమ్‌‌లో రూ. 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ  కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించింది. 

రూ. 2.10 కోట్లు బినామీ అకౌంట్స్​లో జమ

గొర్రె పిల్లల కొనుగోలు కోసం కొండాపూర్‌‌‌‌లోని ‘లోలోనా ది లైవ్ కంపెనీ’కి గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ ఖాజా మొయినొద్దీన్ తో పాటు పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. 2017 నుంచి గొర్రెలను సప్లయ్ చేస్తున్న 18 మంది రైతుల వద్ద133 యూనిట్లను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన రూ.2.10 కోట్లు తమ బినామీల అకౌంట్స్‌‌లో డిపాజిట్ చేసుకున్నారు. బినామీ అకౌంట్ హోల్డర్స్‌‌నే  గొర్రె పిల్లలను విక్రయించిన రైతులుగా రికార్డుల్లో చూపారు. అసలైన రైతులకు ఎలక్షన్‌‌ కోడ్‌‌ కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు.

గుట్టురట్టు కావడంతో దుబాయ్ పరార్

ఎలక్షన్స్‌‌ కోడ్‌‌ ముగిసిన తర్వాత కూడా రైతులకు చేరాల్సిన డబ్బు వారి అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ కాలేదు. దీంతో బాధిత రైతులు మాసబ్‌‌‌‌‌ట్యాంక్‌‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఆరా తీశారు. తమకు రావాల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన ఇతరుల అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ అయినట్లు గుర్తించారు. 2023 డిసెంబర్‌‌‌‌లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కాంగ్రెస్ సీరియస్‌‌గా తీసుకుని ఏసీబీకి బదిలీ చేసింది. 

అదే సమయంలో ఖాజా మొయినొద్దీన్, ఆయన కొడుకు  దుబాయ్ కి పారిపోయారు. వీరిపై ఏసీబీ అధికారులు లుకౌట్​ సర్క్యులర్​ జారీ చేశారు. హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ సహకారంతో మొయినొద్దీన్​ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులైన రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ రాంచందర్‌‌‌‌నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్‌‌కుమార్‌‌‌‌, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి సహా మొత్తం 17 మందిని ఏసీబీ ఇదివరకే అరెస్ట్ చేసింది.