ఢిల్లీ కాదు.. ముంబై కాదు భాగ్యనగరమే టాప్.. రియల్ ఎస్టేట్‎ రిటర్న్స్‎లో హైదరాబాద్ హవా

 ఢిల్లీ కాదు.. ముంబై కాదు భాగ్యనగరమే టాప్.. రియల్ ఎస్టేట్‎ రిటర్న్స్‎లో హైదరాబాద్ హవా
  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 80శాతం రిటర్న్స్!
  • దేశంలోనే ముందున్న మన భాగ్యనగరం
  • సెకండ్, థర్డ్ ప్లేస్ లలో నోయిడా, గుర్గావ్
  • నాలుగో స్థానంలో ఢిల్లీ, ఫిఫ్త్ ప్లేస్​లో బెంగళూరు
  • ఆరో స్థానానికి పరిమితమైన ఆర్థిక రాజధాని ముంబై
  • ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంకర్ సార్థక్ అహూజా తాజా రిపోర్ట్


హైదరాబాద్: రియల్ ఎస్టేట్‎లో పెట్టిన పెట్టుబడులకు ఎక్కువ రిటర్న్స్​అందించడంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని వెల్లడయింది. ఇక్కడ భూములు, విల్లాలపై పెట్టిన పెట్టుబడులకు 80శాతం రిటర్న్స్ వస్తున్నాయని ఇన్వెస్ట్​మెంట్​బ్యాంకర్ సార్థక్ అహూజా సర్వేలో తేలింది. ఇది దేశంలోనే నంబర్ వన్ స్థానం కావడం విశేషం.

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న నోయిడా, గుర్గావ్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. 2020 నుంచి ఇప్పటి వరకు టాప్ మెట్రో నగరాలను పరిశీలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు 80శాతం రాబడిని తెచ్చిపెట్టినట్లు అహూజా చెప్పారు. ఈ భారీ వృద్ధి ముందు మిగిలిన నగరాలు చాలా వెనకబడ్డాయని తన లింక్డిన్ పోస్టులో స్పష్టం చేశారు. 

అభివృద్ధి చెందుతున్న నగరాలవైపే

రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడి దారులు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న నగరాల వైపు చూస్తున్నట్టుగా ఈ విశ్లేషణ ద్వారా అర్థమవుతోంది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ప్రారంభిస్తుండటం, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక, లైఫ్  సైన్సెస్ రంగాల అభివృద్ధికి స్కోప్ ఉండటంతో రియల్టీ పెరుగుతోంది.  నైట్ ఫ్రాంక్– 2024  నివేదిక ప్రకారం హైదరాబాద్‎లో సగటు వార్షిక వృద్ధి 6శాతం నుంచి 14శాతం వరకు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించగా.. మేడ్చల్-–మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి జిల్లాల్లో ఎక్కువ రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతున్నట్లు పేర్కొంది. 

రియల్టీ డిమాండ్​కు అనుగుణంగా నోయిడా, గుర్గావ్​, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కొత్త ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.. చెన్నై , కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా లాంటి నగరాలు మాత్రం కొంత వెనుకబడినట్లు రియల్టీ రిపోర్టులు కూడా చెబుతున్నాయి. ప్రధానంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాలు రియల్టీ పెట్టుబడులకు కేంద్రాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది.

గుర్గావ్‎లో రియల్ వృద్ధికి ద్వారక ఎక్స్ ప్రెస్ వే కారణం

ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ అభివృద్ధి చెందుతోంది. అక్కడ ప్రభుత్వం చేపట్టిన ద్వారకా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే, గోల్ఫ్ కోర్స్ రోడ్ తదితర నిర్దిష్ట కారిడార్లు స్థిరాస్తి రంగం ముందుకు సాగడానికి దోహదపడ్డాయి. ఇవి గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. నోయిడా విషయానికి వస్తే  ప్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈక్విటీ ప్రకారం, కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సగటు ధర 2019 నుంచి 2024 వరకు 152శాతం పెరిగింది. రియల్ లాభాల్లో మెట్రో సిటీలు కోల్ కతా, చెన్నై  పేలవంగా ఉండటం గమనార్హం. బెంగళూరు, ముంబై స్థిరమైన స్వల్పకాలిక పెరుగుదలను నమోదు చేసుకొని ముందుకు సాగుతున్నాయి.