ఆర్టికల్ 370 రద్దు… ఇండియా, పాకిస్తాన్లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అలజడి రేపిన విషయమిది. చైనాతో కలిసి పాక్ ఎన్ని ఎత్తులు వేసినా వాటిని ఇండియా చిత్తు చేసింది. యునైటెడ్ నేషన్స్లోనే ఆ రెండు దేశాల నోళ్లు మూయించింది. ఇందులో సయ్యద్ అక్బరుద్దీన్ ముఖ్యపాత్ర పోషించారు. ఈయనకు తోడుగా మరింత మంది అధికారులు సాయమందించారు. దేశాన్ని గెలిపించారు. వారిలో సయ్యద్ అక్బరుద్దీన్తోపాటు మరో ముగ్గురు మనోళ్లు ఉన్నరు.
సయ్యద్ అక్బరుద్దీన్
హైదరాబాద్లోనే పుట్టిపెరిగారు సయ్యద్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1985 ఐఎఫ్ఎస్ బ్యాచ్ అధికారి, 2016 జనవరి నుంచి యూఎన్ శాశ్వత ప్రతినిధిగా, ఇండియా అంబాసిడర్గా కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ తండ్రి సయ్యద్ బషీరుద్దీన్.. ఓయూలో జర్నలిజం డిపార్ట్మెంట్హెడ్గా, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా పని చేశారు. ఖతర్ అంబాసిడర్గా పని చేశారు. అక్బరుద్దీన్… యూఎన్లో ఎన్నో కీలక అంశాలపై ఇండియా వాయిస్ను బలంగా, స్పష్టంగా వినిపించారు. ఆయన మాటలు కటువుగా ఉండవు. కానీ తూటాల్లా పేలుతాయి.
కకనూరు నాగరాజ్నాయుడు
డిప్యూటీ పర్మినెంట్ రెప్రజెంటేటివ్గా పని చేస్తున్నారు కకనూర్ నాగరాజ్నాయుడు. యూఎన్ పర్మినెంట్ మిషన్లో ‘సెకెండ్ ఇన్ కమాండ్’గా ఉన్నారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీలో బీఏ చదివారు. తర్వాత అమెరికాలో ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ డిప్లొమసీ నుంచి మాస్టర్స్ పట్టా పొందారు. 1998 ఐఎఫ్ఎస్ అధికారి. 2018 జూన్లో జమ్మూకాశ్మీర్ అంశంపై ఇండియా స్టాండ్ గట్టిగా వినిపించారు.
సందీప్ కుమార్ బయ్యపు
2007 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. యూఎన్లో ఇండియన్ టీమ్మెంబర్. పర్మినెంట్ మిషన్ఫస్ట్ సెక్రెటరీగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాజీపల్లిలో పుట్టి పెరిగారు. హైదరాబాద్లో చదువుకున్నారు.
రాజా కార్తికేయ
యూఎన్ డిపార్ట్మెంట్ఆఫ్ పీస్ బిల్డింగ్, పొలిటికల్ అఫైర్స్లో పొలిటికల్ అఫైర్స్ ఆఫీసర్గా పని చేస్తున్నారు రాజా కార్తికేయ. ఈయనకూ హైదరాబాద్ తో రిలేషన్ ఉంది. విశాఖపట్నంలో పుట్టినా, హైదరాబాద్లో పెరిగారు. ఈయన తండ్రి హైదరాబాద్లో ఓ సీనియర్ జర్నలిస్టు కొడుకు. నిజాం కాలేజీలో కార్తికేయ ఓల్డ్ స్టూడెంట్.