- సంరక్షించడంతో పాటు వాటి సంతతిని పెంచినందుకు గుర్తింపు
- ఢిల్లీలో అవార్డు అందుకున్న క్యూరేటర్ వసంత
- అటవీశాఖకు మంత్రి కొండా సురేఖ అభినందనలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మరో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో దేశంలోనే మరే జూ పార్కుకు దక్కని గౌరవం మన జూ పార్కుకు లభించింది. అంతరించిపోతున్న అరుదైన 'మౌస్ డీర్' జాతిని సంరక్షించడంతోపాటు వాటి సంతతిని పెంచి తిరిగి అడవుల్లోకి విడిచిపెట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకుగాను నెహ్రూ జూ పార్కుకు ‘స్కాచ్’ అవార్డు వరించింది.
వన్యప్రాణుల విభాగంలో ఈ ఘనత సాధించిన దేశంలోనే తొలి జూ పార్క్గా నెహ్రూ జూ పార్కు రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో జూ క్యూరేటర్ వసంత ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణుల సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. జూ క్యూరేటర్ వసంత మాట్లాడుతూ.. పీసీసీఎఫ్ డాక్టర్ సీ సువర్ణ, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ అందించిన సహకారం, జూ సిబ్బంది కష్టం వల్లే గుర్తింపు దక్కిందన్నారు. నామినేషన్ ప్రక్రియలో మద్దతుగా నిలిచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు సాధించిన జూ అధికారులను, సిబ్బందిని మంత్రి సురేఖ ప్రత్యేకంగా అభినందించారు. అరుదైన వన్యప్రాణులను కాపాడటంలో అటవీ శాఖ చూపిస్తున్న చొరవకు ఈ అవార్డు నిదర్శనమని కొనియాడారు.
