
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది. బద్వేల్ ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2 లో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ 1, 2 పేరుతో హుడా అప్రూవల్తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఅవుట్లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.
రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి, 500 వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది. హైడ్రా ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.