V6 News

శంషాబాద్ లో 9 ఎకరాలు కాపాడిన హైడ్రా

శంషాబాద్ లో 9 ఎకరాలు కాపాడిన హైడ్రా
  • విలువ రూ. 90 కోట్లకు పైనే – ఫెన్సింగ్​వేసిన హైడ్రా స్టాఫ్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 626/2లో  176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాలను కేటాయించారు. 9.05 ఎకరాలుండగా నిజాంల‌‌‌‌కు చెందిన‌‌‌‌ భూములని కొంత‌‌‌‌మంది హ‌‌‌‌క్కులు క్లెయిమ్​చేయగా, కోర్టులో కేసు వేశారు.

దీంతో స్టే వచ్చింది. అయినా, ఆ ఆర్డర్​ను పట్టించుకోకుండా తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ భూమిని చ‌‌‌‌దును చేసి లే అవుట్‌‌‌‌గా మార్చడంతో ఫిర్యాదులు వచ్చాయి. ఫీల్డ్​లెవెల్​లో పరిశీలించి నిజమేనని తేలడంతో హైడ్రా రంగంలోకి దిగింది. 9.05 ఎక‌‌‌‌రాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. 

ఓవర్ హెడ్​ట్యాంకు కూల్చేసిన హైడ్రా

సంజీవరెడ్డి నగర్‌‌‌‌‌‌‌‌లో 65 ఏండ్ల కింద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో, 80 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఓవర్‌‌‌‌‌‌‌‌ హెడ్ వాటర్ ట్యాంక్ ను బుధవారం హైడ్రా కూల్చేసింది.  జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణులు ఈ ట్యాంక్ వినియోగానికి పనికిరాదని నివేదిక ఇవ్వడంతో 15 ఏండ్లుగా నిరుపయోగంగా ఉంది. చుట్టూ ఇండ్లు, సమీపంలో వాటర్​బోర్డు, జీహెచ్‌‌‌‌ఎంసీ, హౌసింగ్ బోర్డు ఆఫీసులు, ట్రాన్స్​ఫార్మర్​ఉండడంతో కూల్చడం సవాలుగా మారింది.

దీంతో వాటర్​బోర్డ్​..హైడ్రాను సంప్రదించగా, బుధవారం ఉదయం 6 గంటలకు ఐరన్ రోపులు, రెండు ఎత్తయిన హిటాచీల సాయంతో కూల్చివేతలు మొదలుపెట్టారు. ఉదయం 10 గంటల కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. నిర్మాణం ఉన్న పరిధిలోనే ట్యాంక్ పడేలా చర్యలు తీసుకోవడంతో చుట్టుపక్కల బిల్డింగులకు ఎలాంటి నష్టం జరగలేదు.