హైదరాబాద్, వెలుగు: ‘వెటర్నరీ డాక్టర్ హత్య దురుదృష్టకరం. ఆ నిందితులను తక్షణమే చంపండి.. ఉరి తీయండని రాష్ట్ర ప్రజలతో పాటు దేశమంతా, పార్లమెంటులో కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. ఆ ఆవేశం, ఆవేదన నాకూ ఉంది. కానీ నేను ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని. అలా చేయమని అనలేను. 2012లో జరిగిన ఘటన నిందితులకు ఉరి శిక్ష ఇంతవరకు అమలు కాలేదు. ఉగ్రవాది కసబ్ను ఎన్నేళ్లు జైల్లో పెట్టారో అందరం చూశాం. చట్టాలు మారాలి’ అని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ఆన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆలిండియా సర్వీస్ అండ్ సెంట్రల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్కు 94వ ఫౌండేషన్ కోర్సు సర్టిఫికెట్ అందించే కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు.
శ్రీహరి కోట నుంచి వందలాది ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్న మన దేశానికి మరో కోణం ఉందని అన్నారు. దేశంలో విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని.. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ వేల గ్రామాల్లో కోట్లాది మంది ప్రజలకు నీరు, కరెంటు, రోడ్లు, టాయిలెట్స్ లేవని గుర్తు చేశారు. ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందన్నారు.
ఆరేడేండ్లకే మైండ్సెట్ మారుతోంది
పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. తమకు ఐదేండ్లకోసారి ఎన్నికల పరీక్ష ఉంటుందని, సివిల్ సర్వీస్ అధికారులకు ఓ పరీక్ష రాస్తే రిటైరయ్యే వరకు ఏ సమస్య ఉండదని అన్నారు. సర్వీసులో చేరిన ఆరేడేండ్లకే మైండ్సెట్ మారుతున్న అధికారులున్నారని, ఎన్నేళ్లయినా పాజిటివ్గా ఉన్న అధికారులను తన అనుభవంలో కొంత మందినే చూశానని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు ఆలస్యమైన సందర్భాల్లో సీఎస్ఆర్, విరాళాల ద్వారా అభివృద్ధి చేపట్టాలన్నారు. కోర్సు పూర్తి చేసిన ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్టీఎస్ లాంటి 15 సర్వీసులకు చెందిన 140 మందికి కేటీఆర్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ సలహాదారు ఏపీవీఎన్ శర్మ, ఎంసీహెచ్ ఆర్డీ డీజీ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

