దేశంలో RSS బ్యాన్ చేయాలి: మల్లికార్జున ఖర్గే

దేశంలో RSS బ్యాన్ చేయాలి: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేళ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతిభద్రతల సమస్యలు బీజేపీ-ఆర్ఎస్ఎస్ కారణంగానే తలెత్తుతున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు దేశంలో ఆర్ఎస్ఎస్‎పై నిషేధం విధించాలని అన్నారు. ప్రధాని మోడీకి నిజంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్‎పై గౌరవం ఉంటే ఈ పని చేయాలని సవాల్ విసిరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఖర్గే పేర్కొన్నారు. 

శుక్రవారం (అక్టోబర్ 31) భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 41వ వర్ధంతి కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. మహాత్మ గాంధీ హత్యతో ఆర్ఎస్ఎస్‎కు సంబంధం ఉందని.. ఈ మేరకు గాంధీ హత్య తర్వాత 1948లో శ్యామా ప్రసాద్ ముఖర్జీకి అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ రాసిన లేఖను ఖర్గే ప్రస్తావించారు.  గాంధీ హత్యలో సంఘ్ అనుమానాస్పద కార్యకలాపాలను తన మంత్రిత్వ శాఖ గుర్తించిందని సర్దార్ పటేల్‎లో లేఖలో పేర్కొన్నారని గుర్తు చేశారు. గాంధీ హత్య తర్వాత దేశంలో సంవత్సరం పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను పటేల్ నిషేధించారని, దేశ లౌకిక ప్రయోజనాల కోసం ఆయన ఈ చర్య తీసుకున్నారని తెలిపారు. 

జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్ మధ్య గొప్ప సంబంధాలు ఉన్నప్పటికీ, వారి మధ్య విభేదాలు ఉన్నట్లు చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి గాంధీ, గాడ్సే, ఆర్ఎస్ఎస్, 2002 అల్లర్ల ప్రస్తావనలను తొలగించడం ద్వారా మోడీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని ఖర్గే ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా చరిత్రను తిరగ రాసుకుంటుందని ఆరోపించారు. ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఇద్దరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేశారని కొనియాడారు.