కోల్కతా: బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నిస్తూ కొందరు రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇలాంటి చర్యలను తాను సహించనని ఆమె తెలిపారు. ఎన్సీఆర్ బీ రికార్డ్స్ ప్రకారం కొన్నేండ్ల పాటు దేశంలోనే సురక్షిత రాష్ట్రంగా కోల్ కతా స్థానం సంపాదించుకుందని మమత చెప్పారు. రాష్ట్రంలో ఈడీ అధికారులపై జరిగిన దాడులపై చర్చ నడుస్తున్న సమయంలో వాటిని నేరుగా ప్రస్తావించకుండా దీదీ మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్ లో సోమవారం జరిగిన స్టూడెంట్స్ వీక్ ప్రోగ్రామ్ లో ఆమె ప్రసంగించారు. ‘‘నాపై వచ్చే విమర్శలను నేను పట్టించుకోను. కానీ, ఎవరైనా సరే రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తే నేను ఊరుకోను” అని దీదీ పేర్కొన్నారు. విద్యార్థులందరు సానుకూలంగా ఆలోచించాలని సూచించారు.