న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న పోరు ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు ఓ భారీ ఆర్థిక వనరు. అయితే టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఒక్క మ్యాచ్ రద్దయితే ఐసీసీ, బ్రాడ్కాస్టర్లకు దాదాపు రూ. 2,200 కోట్లకు పైగా (250 మిలియన్ డాలర్లు) భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా.
ఈ మ్యాచ్కు సంబంధించి హోస్ట్ బ్రాడ్కాస్టర్ కేవలం అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే రూ. 200 నుంచి 250 కోట్ల వరకూ నష్టపోయే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో కేవలం 10 సెకన్ల ప్రకటన స్లాట్ ధర దాదాపు రూ. 40 లక్షల వరకు పలుకుతోంది. ఇప్పటికే ఐసీసీతో ఉన్న 3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న జియో హాట్స్టార్కు ఈ మ్యాచ్ రద్దు కావడం పెద్ద దెబ్బ కానుంది. ఇది ఐసీసీకి, బ్రాడ్కాస్టర్లకు మధ్య ఉన్న ఆర్థిక బంధాన్ని మరింత క్లిష్టతరం చేసే ప్రమాదం ఉంది.
ఈ ఒకే ఒక్క మ్యాచ్ విలువ 250 మిలియన్ డాలర్లుగా ఉంటే, పాకిస్తాన్ బోర్డు (పీసీబీ) ఏడాది మొత్తం ఆదాయం కేవలం 35.5 మిలియన్ డాలర్లు మాత్రమే. అంటే పాక్ బోర్డు వార్షిక ఆదాయం కంటే ఈ మ్యాచ్ విలువ దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. ఈ మ్యాచ్ రద్దయితే బీసీసీఐ, పీసీబీకి చెరో రూ. 200 కోట్ల నష్టం వస్తుంది. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఈ నష్టాన్ని భరించగలదు. కానీ, పాక్ బోర్డుకు మాత్రం కోలుకోలేని ఆర్థిక దెబ్బ తగలనుంది.
పాక్ ఈ-మెయిల్ డ్రామా..
పాక్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా బాయ్కాట్ ప్రకటన చేయగా.. దీనిపై పీసీబీ ఇప్పటి వరకు ఐసీసీకి ఎటువంటి అధికారిక లేఖ రాయలేదు. ఐసీసీకి అధికారిక ఈ–మెయిల్ పంపే విషయంలో పాక్ బోర్డు కావాలనే ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ పాక్ సెమీస్ లేదా ఫైనల్ చేరి ఇండియాతో తలపడాల్సి వస్తే ఆ మ్యాచ్నూ బాయ్కాట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పాక్ నుంచి అధికారిక సమాచారం లేకపోవడంతో పీసీబీపై చర్యలు ప్రకటించే విషయంలో ఐసీసీ వేచి చూస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఐసీసీ బోర్డు అత్యవసర సమావేశం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఐసీసీ డైరెక్టర్లు మాత్రం తమకు అటువంటి సమాచారం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ తమకు నచ్చిన మ్యాచ్లే ఆడతామనడంపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఇంటర్నేషనల్ ఈవెంట్లలో అన్ని జట్లు సమాన నిబంధనలతో ఆడాలి. ఇలా కొన్ని మ్యాచ్లను బహిష్కరించడం క్రీడా స్ఫూర్తికే విరుద్ధం. దీనివల్ల లక్షలాది మంది అభిమానులు నష్టపోతారు’ అని ఐసీసీ పేర్కొంది.
మా చేతుల్లో ఏమీ లేదు: పాక్ కెప్టెన్ సల్మాన్
ఇండియాతో మ్యాచ్ను బహిష్కరించాలన్నది తమ వ్యక్తిగత నిర్ణయం కాదని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా అంటున్నాడు. ప్రభుత్వం, బోర్డు, ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడం తప్ప తమ చేతుల్లో ఏమీ లేదని మెగా టోర్నీ కోసం శ్రీలంక బయల్దేరేముందు అతను మీడియాతో చెప్పాడు. సోమవారం సాయంత్రం శ్రీలంక చేరుకున్న పాక్ టీమ్ బుధవారం కొలంబోలో ఐర్లాండ్తో వామప్ మ్యాచ్ ఆడనుంది.
