టీ20 వరల్డ్‌కప్‌లో 24 జట్లు?.. ఐసీసీ మెగా ప్లాన్ రెడీ!

టీ20 వరల్డ్‌కప్‌లో 24 జట్లు?.. ఐసీసీ మెగా ప్లాన్ రెడీ!

ICC T20 World Cup: క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింతగా విస్తరించేందుకు ఐసీసీ (ICC) ప్రణాళికలు రచిస్తోంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, 2032 నాటికి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 20 నుంచి 24కు పెంచాలని ఐసీసీ భావిస్తోంది. అంతేకాదు, భవిష్యత్తులో ఈ టోర్నీని ఏకంగా 32 జట్లతో నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. 2024లో టీ20 ప్రపంచకప్‌ను 16 జట్ల నుంచి 20 జట్లకు విస్తరించగా.. 2024, 2026 ఎడిషన్లు భారీ సక్సెస్ సాధించడంతో, చిన్న జట్లకు (Emerging Nations) ప్రపంచ స్థాయి వేదికపై పెద్ద జట్లతో పోటీపడే అవకాశం కల్పించాలని ఐసీసీ చూస్తుంది. 

క్రికెట్ విస్తరణకు టీ20యే కీలకం: 
క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడానికి టీ20 ఫార్మాట్‌ను ఐసీసీ ప్రధాన ఆయుధంగా వాడుకుంటుంది. దీనికి తోడు ఏకంగా 126 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్లీ ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఆడిన క్రికెట్, ఇప్పుడు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ద్వారా తిరిగి ఒలింపిక్ వేదికపై మెరవనుంది.

2028, 2030 టోర్నీల పరిస్థితి ఏంటి: 
రాబోయే 2028, 2030 టీ20 ప్రపంచకప్‌లు మాత్రం ఇప్పటిలాగే 20 జట్లతోనే జరగనున్నాయి. ఈ రెండు ఎడిషన్ల కోసం ఒక కొత్త ఫార్మాట్‌ను ఐసీసీ తీసుకొచ్చింది. కానీ 2032 నాటికి జట్ల సంఖ్యను 24కి పెంచే అవకాశం మాత్రం క్లీయర్ కనిపిస్తుంది. 

ALSO READ : విరాట్ లైఫ్‌స్టైల్ ట్రై చేసిన సంజు..

ఐసీసీ ముందున్న ప్రధాన సవాళ్లు:
అయితే జట్ల సంఖ్యను 24 లేదా 32కు పెంచడం ఐసీసీకి అంత సులభమైన విషయమేమీ కాదు.. జట్లు పెరిగితే మ్యాచ్‌ల సంఖ్యతో పాటు టోర్నీ సమయం కూడా పెరుగుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల ఫ్రాంచైజీ లీగ్‌లతో ఆటగాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ద్వైపాక్షిక సిరీస్‌లు (Bilateral series), ఆటగాళ్లపై పనిభారం (Workload) దెబ్బతినకుండా టోర్నీని నిర్వహించడం ఐసీసీకి పెద్ద సవాలుగా మారనుంది. కానీ, ఈ టోర్నీ విస్తరణపై ఐసీసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.