- బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్
- మన విజయంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఖతమైతది
- పార్టీలో ప్రతి ఒక్కరు ఇదే టార్గెట్తో పని చేయాలి
- రెండు ఎమ్మెల్సీలను గెలవాలి పార్టీ స్టేట్ ఆఫీసులో పదాధికారులతో భేటీ
హైదరాబాద్, వెలుగు: సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కమలందే అని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. బుధవారం ఆ పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘సాగర్ ఉప ఎన్నికకు వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే చాన్స్ ఉంది. అప్పటి నుంచి బీజేపీ రాష్ట్ర పదాధికారులంతా అక్కడే మకాం వేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయాలి” అని దిశానిర్దేశం చేశారు. సాగర్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ముడిపడిఉందని, అక్కడ మనం గెలిస్తే ఆర్ఎస్ పని ఖతమైపోయినట్లేనని చెప్పారు. సాగర్ లో బీజేపీ అభ్యర్థి ఎవరనేది అందరి ఆమోదం మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక చేస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోడీ తరహా పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ మాటలకు, టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలె..
హైదరాబాద్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే కావాలని తరుణ్ చుగ్ అన్నారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ జాతీయ నేతలు వస్తారని చెప్పారు. జిల్లా స్థాయిలో జాతీయ నేతలు, నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర నేతలు, మండల స్థాయిలో జిల్లా నేతలు ప్రచారం చేస్తారన్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, నిరుద్యోగులు టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతను చూపుతున్నందున, దీన్ని అవకాశంగా మలచుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్ రావు, అర్వింద్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, డీకే అరుణ, రాంచందర్ రావు, రాజాసింగ్, రఘునందన్ రావు, మంత్రి శ్రీనివాస్, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు సమావేశంలో చర్చించిన అంశాలు మీడియాకు వివరించారు. ఈ నెల 28 వరకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలు సేకరించి, నిరుద్యోగ భృతికి ఎంతమంది అర్హులు ఉన్నారనే వివరాలు బయటపెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లా పార్టీ పదాధికారుల సమావేశాలు, వచ్చే నెల 1 నుంచి 3 వరకు మండల పార్టీ పదాధికారుల సమావేశాలు, వచ్చే నెల 4 నుంచి 10 వరకు అనుబంధ మోర్చాల రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
బీజేపీలో చేరికలు
రంగారెడ్డి, జనగామ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు పలువురు బుధవారం పార్టీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో పెద్ద సంఖ్యలో జరుగుతున్న చేరికలు పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు
నిదర్శమన్నారు.
