హైదరాబాద్ మెట్రో విషయంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రెసివ్ గా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. IRFC లోన్ విషయంలో త్వరలో మరోసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయాలని ఇటీవలే సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. ఆ తర్వాత వారం, పదిరోజులు వేచిచూడాలని, అప్పటికీ లోన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ఇవ్వకుంటే ఇతర ప్రైవేట్ బ్యాంకుల నుంచి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
ఐఆర్ఎఫ్సీ నుంచి తీసుకునే అప్పుపై కేవలం 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. కానీ బయట బ్యాంకుల నుంచి 8 శాతం వడ్డీ రేటు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది. కేంద్రం తీరువల్ల మెట్రో పనులు ఆగితే మరింత నష్టం తప్పదని భావిస్తున్న ప్రభుత్వం 8 శాతం వడ్డీకైనా సరే ఏదైనా బ్యాంక్ లేదా ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణం సేకరించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మెట్రో ఫేజ్-–2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామ్యానికి కేంద్రం ముందుకు రాకుంటే ఇక ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం పక్కనపెట్టి, ఎన్వోసీ తీసుకోవాలని యోచిస్తోంది.
నిజానికి మెట్రో–2ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం (50:50 )లో చేపడితే.. ఈ ప్రాజెక్టుకయ్యే మొత్తం రూ. 32,237 కోట్ల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం తన ఈక్విటీ వాటా కింద కేవలం రూ. 5,802 కోట్లను (18%) మాత్రమే గ్రాంట్ల రూపంలో సమకూరుస్తుంది. అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేటాయించాల్సి ఉంటుంది. భూసేకరణ, పరిహారం పంపిణీ ఖర్చుల కింద మరో రూ. 2,902 కోట్లను (9%) రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా భరించాలి.
మిగిలిన 55 శాతం నిధులను, అంటే దాదాపు రూ. 17,731 కోట్లను అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఐఆర్ఎఫ్సీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు సేకరించాలనేది ప్లాన్. కేంద్ర పెద్దల కొర్రీల నేపథ్యంలో జాయింట్వెంచర్ కోసం చూడకుండా కేంద్రం నుంచి ఎన్వోసీ లభించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మెట్రో విస్తరణను పట్టాలెక్కించేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సైతం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
