అమ్మఒడి నగదు వద్దనుకుంటే ల్యాప్ టాప్

అమ్మఒడి నగదు వద్దనుకుంటే ల్యాప్ టాప్

నెల్లూరులో ఇవాళ(సోమవారం) అమ్మఒడి రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ తల్లుల ఖాతాలోకి నగదు జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి పథకంలో నగదు వద్దనుకుంటే వారికి ల్యాప్ టాప్ అందిస్తామని తెలిపారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు మాత్రమే ఈ ఆఫర్‌ అని ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ల్యాప్ టాప్ ఖరీదు రూ.27 వేలు కాగా, అనేక కంపెనీలు రూ.18,500కే ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.

అయితే దీనికి రివర్స్ టెండరింగ్ పిలిస్తే మరింత ధర తగ్గే అవకాశం ఉందని సీఎం జగన్ వివరించారు. 4 GB ర్యామ్‌, 500 GB హార్డ్‌డిస్క్‌, విండోస్ 10 ఓఎస్‌ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తామన్నారు. రాబోయే మూడేళ్లలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సేవలు అందిచడంతో పాటు అండర్ గ్రౌండ్‌ ఇంటర్నెట్ కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే పేదింటి పిల్లలు ఆ సౌకర్యానికి దూరమయ్యారని, అందుకే  ల్యాప్ టాప్ లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సీఎం జగన్.