ఐఐటీ బాంబే క్యాంపస్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవాయ్లోని క్యాంపస్ హాస్టల్ గదిలో 22 ఏళ్ల బీటెక్ విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాకు చెందిన సాహిల్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ వాడటంతో ఈ అనూహ్య ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
శుక్రవారం జరిగిన పరీక్ష సమయంలో సాహిల్ మొబైల్ ఫోన్ వాడుతూ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఏఐ టూల్ చాట్జీపీటీ సహాయంతో ప్రశ్నాపత్రానికి సమాధానాలు వెతికేందుకు ప్రయత్నించినట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది. పరీక్ష హాల్లో ఈ ఘటన జరిగిన తర్వాత.. హెచ్ఓడీ అతనికి ఎలాంటి డిసిప్లినరీ యాక్షన్ ఉండదని భయపడవద్దని నచ్చజెప్పి కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడదని భరోసా కూడా ఇచ్చి పంపించారు.
అయితే ఆ తర్వాత హాస్టల్ గదికి వెళ్లిన సాహిల్.. ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటుందనుకున్న సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. సాయంత్రం ఎంతకీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు అధికారులకు సమాచారం అందించారు. హాస్టల్ నంబర్ 4లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవుడిగా కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన ఐఐటీ బాంబే క్యాంపస్లో తీవ్ర ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. గత 7 నెలల వ్యవధిలో పవాయ్ క్యాంపస్లో ఇలాంటి ఆత్మహత్యలు జరగడం ఇది 3వ కావడం గమనార్హం. ఫిబ్రవరిలో ఒకరు, అలాగే జూలై 2026లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. వరుస ఘటనలతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
విద్యార్థి మృతిపై పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తూ ఐఐటీ విద్యార్థులు క్యాంపస్లో నిరసనలకు దిగారు. తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్లకు అవసరమైన మానసిక కౌన్సెలింగ్, సహాయ సహకారాలను అందిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తమ బిడ్డ ధైర్యవంతుడని ఇలా చేసే టైప్ కాదంటున్నారు. తమ కొడుకు ఫైటర్ అని.. కాలేజీలో దిగువ తరగతి నుంచి వచ్చినవారిపై వివక్ష వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తాము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తమకు న్యాయం కావాలని అప్పటి వరకూ క్యాంపస్ వీడేది లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. నిజానిజాలు బయటకు రావాలని కోరారు. విద్యార్థి మృతిపై క్యాంపస్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. వరుస ఆత్మహత్యలపై పోరుకు దిగారు. డైరెక్టర్ వెంటనే రాజీనామా చేయాలంటూ నినదించారు ప్లకార్డులతో.
