- మార్చిలో ఎండలు మండినయ్
- ఏప్రిల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటది
- దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ అన్న ఐఎండీ
- మార్చిలో సగటున 33.1 డిగ్రీలు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మండుతున్నయ్. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఐఎండీ శనివారం వెల్లడించింది. మార్చిలో దేశవ్యాప్తంగా అత్యధికంగా సగటున 33.1 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయని చెప్పింది. దేశ చరిత్రలోనే మార్చి నెలలో ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే మొదటిసారని పేర్కొంది. ఏప్రిల్లో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పింది. మార్చిలో మినిమం సగటు ఉష్ణోగ్రత 20.24 డిగ్రీలుగా ఉందని, ఇది ఇప్పటివరకు థర్డ్ హయ్యెస్ట్ అని పేర్కొంది. వాయవ్య ఇండియాలో అత్యధిక ఉష్ణోగ్రత 30.73 డిగ్రీలుగా నమోదైందని, 122 సంవత్సరాల తర్వాత ఇదే అత్యధికమని ఐఎండీ డీజీఎం ఆర్కే జెనమణి తెలిపారు. తూర్పు, ఈశాన్య భారతంలో కూడా ఇదే విధంగా టెంపరేచర్లు రికార్డయ్యాయని చెప్పారు. గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలో వడగాలులు వీచే అవకాశం ఉందని, పొడి వాతావరణం కూడా ఉంటుందని తెలిపారు. వచ్చే పది రోజుల్లో అక్కడ ఎలాంటి వర్షాలు కురవవని పేర్కొన్నారు. అలాగే రాజస్థాన్, గుజరాత్, సెంట్రల్ ఇండియా, హిమాలయ రీజియన్లలో ఈ నెల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఒడిశాలో 120 ఏండ్ల తర్వాత మార్చిలో 25.20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ సైంటిస్ట్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. ఆ రాష్ట్రంలో మార్చిలో 96% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. అత్యధిక టెంపరేచర్ల వల్ల దేశంలోని పలు నగరాలు, పట్టణాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు.