రా. 7 నుంచి సోనీ నెట్వర్క్లో
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్) : ఈ ఏడాది వన్డే వరల్డ్కప్ లేదు. ఇప్పుడు ఆడబోయే ఈ సిరీస్.. వరల్డ్కప్ సూపర్ లీగ్లో భాగమూ కాదు. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, రాహుల్ బుమ్రా, పంత్, పాండ్యా, షమీ టీమ్లో లేరు. అయినా.. వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల సిరీస్ నుంచి టీమిండియా ఏం ఆశిస్తున్నది..? దీనికి ఒక్కటే సమాధానం.. యంగ్స్టర్స్ టాలెంట్ను పరీక్షించడం కోసమే. ఇందులో భాగంగా శుక్రవారం క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగే తొలి మ్యాచ్లో ఇండియా.. విండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. పేపర్ మీద చూసినా, ఇటీవల పెర్ఫామెన్స్ చూసినా ఈ సిరీస్లో ఇండియానే ఫేవరెట్గా కనిపిస్తున్నది. రోహిత్ గైర్హాజరీలో శిఖర్ ధవన్ రెండోసారి టీమిండియాకు సారథ్యం వహిస్తున్నాడు.
కూర్పు ఎలా?
సీనియర్ల ప్లేస్లకు చాలా మంది యంగ్స్టర్స్ అందుబాటులోకి రావడంతో ఫైనల్ ఎలెవన్పై ఇండియా మేనేజ్మెంట్ కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నది. ఓపెనింగ్లో ధవన్కు తోడుగా ఇషాన్, రుతురాజ్లో ఒకరికే చాన్స్ దక్కనుంది. టెస్ట్ ప్లేయర్ శుభ్మన్ గిల్ను టీమ్లోకి తీసుకోవడం కొత్త చర్చ మొదలైంది. లెఫ్ట్–రైట్ కాంబినేషన్లో భాగంగా ధవన్–గిల్ ఓపెనింగ్ చేసే చాన్స్ లేకపోలేదు. ఫామ్లో ఉన్న దీపక్ హుడాకు మూడో ప్లేస్ ఖాయం. సూర్యకుమార్ను తుది జట్టులోకి తీసుకుంటే ఎక్కడ ఆడిస్తారో చూడాలి. దీంతో సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ ప్లేస్లపై సందిగ్ధత మొదలైంది. ఇంగ్లండ్లో విఫలమైన శ్రేయస్కు మరో చాన్స్ ఇస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. హార్దిక్ లేకపోవడంతో పేస్ ఆల్రౌండర్గా శార్దూల్కు చోటు ఖాయమే. ఇక్కడి పిచ్లు స్పిన్కు అనుకూలం కాబట్టి జడేజాతో పాటు చహల్ను కంటిన్యూ చేయనున్నారు. పేసర్లుగా సిరాజ్, ప్రసిధ్ బాధ్యతలు తీసుకోనున్నారు. మూడో పేసర్గా అర్షదీప్ అరంగేట్రం చేసే చాన్స్ కనిపిస్తున్నది. మరోవైపు గురువారం ఇండియా ఔట్డోర్ ప్రాక్టీస్కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో ప్లేయర్లందరూ ఇండోర్లోనే చెమటోడ్చారు. ధవన్తో పాటు ఇతర బ్యాటర్లు నెట్స్లో కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.
విండీస్ పోటీ ఇచ్చేనా..
బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో వైట్వాష్ అయిన విండీస్... బలమైన ఇండియాకు ఏ మేరకు పోటీనిస్తుందన్నది ఆసక్తిగా మారింది. వన్డేల్లో రీఎంట్రీ ఇస్తున్న ఆల్ రౌండర్ హోల్డర్పై భారీ అంచనాలున్నాయి. కానీ, కెప్టెన్ పూరన్ బ్యాటింగ్ ఫామ్పై ఆందోళన కొనసాగుతున్నది. స్టార్టింగ్లో హోప్, కింగ్.. ఇండియన్ పేసర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మిడిల్లో పావెల్, మేయర్స్, హోల్డర్ అత్యంత కీలకం. వీళ్లు నిలబడితేనే కరీబియన్లు కనీసం మొత్తం ఓవర్లు ఆడగలరు. 2019 వన్డే వరల్డ్కప్ నుంచి విండీస్ 39 ఇన్నింగ్స్లో ఆరుసార్లు మాత్రమే 50 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయడం గమనార్హం.
జట్లు (అంచనా)
ఇండియా: ధవన్ (కెప్టెన్), గైక్వాడ్ / ఇషాన్, శ్రేయస్, దీపక్ హుడా, శాంసన్, సూర్యకుమార్, జడేజా, శార్దూల్, అవేశ్ ఖాన్ / ప్రసిధ్ కృష్ణ, చహల్, సిరాజ్. వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), హోప్, కింగ్, బ్రూక్స్, మేయర్స్, పావెల్, హోల్డర్, అకీల్ హోస్సేన్, అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ, జైడెన్ సీల్స్.