ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు : ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు : ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

తొర్రూరు, వెలుగు : ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు సూచించారు. మహబూబాబాద్‌‌ జిల్లా తొర్రూరు మండలంలోని భోజ్యా తండా, హరిపిరాలకు చెందిన పలువురు శుక్రవారం బీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎంతో మంది వస్తారని, గత 60 ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటూ మాయమాటలు చెబుతారని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

బీఆర్‌‌ఎస్‌‌ అభివృద్ధికి సహకరించే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌‌ఎస్‌‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నామినేషన్‌‌ ఖర్చుల కోసం తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తికి చెందిన టైలరింగ్‌‌ ట్రైనర్లు రూ.10 వేలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, సర్పంచ్‌‌ మాలోతు కాలునాయక్‌‌, నాయకులు కోటి రాంనాయక్‌‌ పాల్గొన్నారు.