అయోమయంలో ఎంసెట్ ర్యాంకర్లు

అయోమయంలో ఎంసెట్ ర్యాంకర్లు

ఇంజినీరింగ్, అగ్రికల్చర్‍, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‍ కౌన్సెలింగ్‍ జూన్‍ 24 నుంచి ప్రారంభం కాబోతుంది. మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ జులై 12తో ముగియనుంది. స్టూడెంట్స్ ఇక తమకు నచ్చిన ఇంజినీరింగ్‍ కాలేజీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఎంసెట్‍ ర్యాంకర్లను ఆకట్టుకునే పనిలో ప్రైవేట్ ఇంజినీరింగ్‍ కాలేజీలు నిమగ్నమై ఉన్నాయి. జేఎన్‍టీయూహెచ్‍, ఓయూ నుంచి గుర్తింపు పొందిన అనుబంధ కాలేజీల వివరాలు, ఏ కోర్సుల్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో విద్యార్థులకు తెలియక అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కౌన్సెలింగ్‍కు ముందుగానే వెబ్‍సైట్‍లో గుర్తింపు కాలేజీల వివరాలు పొందుపరిస్తే ఆయా కాలేజీలకు వెళ్లి ముందుగానే కాలేజీల సమాచారం తెలుసుకునేందుకు వీలు కలిగేదని ఎంసెట్‍లో క్వాలిఫై అయిన విద్యార్థులు వాపోతున్నారు. కౌన్సెలింగ్‍ రోజే బుక్‍లెట్‍ అందిస్తే అన్ని కాలేజీల గుణగణాలు అంచనా వేయడానికి సమయం సరిపోతుందా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభం సర్టిఫికేట్‍ వెరిఫికేషన్‍, ఆప్షన్ల నమోదు త్వరత్వరగా చేయాల్సి ఉంటుంది. పైగా సీట్లు ఖచ్చితంగా రావాలంటే ఎక్కువ సంఖ్యలో కాలేజీల పేర్లను ఆప్షన్‍ కింద పేర్కొనాల్సి ఉంటుంది. దీంతో సరైన ప్రమాణాలు, సదుపాయాలు లేని అసలు తాము ఇంతకు ముందేప్పుడు వినని కాలేజీలు పేర్లను ఎక్కవ మంది విద్యార్థులు నమోదు చేస్తారు. దాంతో సరైన కాలేజీలో సీటు లభించకపోతే తర్వాత ఎంత బాధపడినా చేసేదేమీ ఉండదు. సాంకేతిక పరిజ్ఙానం ఇంతగా అభివృద్ధి చెందినా విద్యార్థులకు ఎంసెట్‍ సమాచారాన్ని అందుబాటులో పెట్టేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదు. గతేడాది కౌన్సెలింగ్‍లో ఏ కాలేజీలో ఏ కోర్సుకు ఎంత ర్యాంకు వారికి సీలు లభించిందో.. రిజర్వేషన్ల వారీగా తదితర సమాచారం తెలసుకోవడానికి ప్రైవేట్‍ సంస్థలపైనే ఆధాపడుతున్నారు. అధికారికంగా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచితే ఖచ్చితమైన సమాచారాన్ని విద్యార్థులు తెలసుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

గ్రేటర్‍లోనే సగం…

ఇటీవల ప్రమాణాలు పాటించని పలు ఇంజినీరింగ్‍ కాలేజీలకు అనుబంధ గుర్తింపును జేఎన్‍టీయూహెచ్‍ రద్దుచేసింది. మరికొన్ని ఇంజినీరింగ్‍ కాలేజీలు తమక తాముగా మూసివేతకు దరఖాస్తు చేసుకొన్నాయి. అలాగే కోర్సులను  రద్దు చేసుకున్న కాలేజీలు సైతం పెద్ద  సంఖ్యలోనే ఉంటాయి. ఎంసెట్‍–2019 కౌన్సెలింగ్‍లో సుమారు 300 పైగా ఇంజినీరింగ్‍, ఫార్మసీ కోర్సులను అందించే ప్రభుత్వ, ప్రైవేట్‍, ఎయిడెడ్‍ ఇన్‍స్టిట్యూట్‍లు పాల్గొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  గ్రేటర్‍ పరిధిలోనివే ఇందులో  దాదాపు సగం కాలేజీలుంటాయి. వీటిల్లో బీటెక్‍, బీఎస్సీ, బీఫార్మసీ తదితర కోర్సులలో సుమారు 50 వేల సీట్ల వరకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఓయూ అనుబంధ ఇంజినీరింగ్‍ కాలేజీల్లోనూ సీట్లను కలుపుకుంటే ఈ సంఖ్య సుమారు 55 వేలకు చేరుతుంది.

ప్రైవేట్‍ ప్రలోభాలు…

ఎంసెట్‍ రాసిన విద్యార్థుల చుట్టూ ప్రైవేట్‍ ఇంజినీరింగ్‍ కాలేజీల సిబ్బంది తిరుగుతున్నారు. ఎలాగోలా తమ వారిని తమ సంస్థల్లో చేర్చుకునేలా పక్కాగా వ్యవహరిస్తున్నారు. అవసరమైతే గిఫ్ట్ లను కూడా ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. గ్రేటర్‍ పరిధిలోని 20 నుంచి 30 ఇంజినీరింగ్‍ కాలేజీల్లోనే కౌన్సెలింగ్‍లో సీట్లు భర్తీ అవుతున్నాయి. మిగతా కాలేజీలు మాత్రం తగినంత మంది విద్యార్థులు చేరక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారందరూ పీఆర్‍ఓ లను నియమించుకొని ఎలాగైనా సీట్లను భర్తీ చేసుకోవాలని చూస్తున్నారు. గ్రేటర్‍ శివారులో ఉన్న పలు కాలేజీలు తమ విద్యా సంస్థలలో జాయినైతే  కొన్నాళ్లూ ఫ్రీ బస్‍ ఫెసిలిటీ కల్పిస్తామని, ఫీజులో రాయితీ ఇస్తామని, కంప్యూటర్‍ కోర్సుల్లో చేరే వారికి ల్యాప్‍టాప్‍లు అందజేస్తామని ఇలా అనేక రకాలుగా ప్రలోభ పెడుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో క్యాంపస్‍ సెలక్షన్‍లో ఎంపికైన ఒకరిద్దరూ విద్యార్థులను వెంటేసుకొని  పేరెంట్స్ ని నమ్మించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఆయా ఇంజినీరింగ్‍ కాలేజీలకు నేరుగా వెళ్లి గతంలో కాలేజీలో వచ్చిన రిజల్ట్స్, బోధన సిబ్బంది విద్యార్హతలు, ల్యాబ్‍ల స్థితి తదితర సమాచారాన్ని పూర్తిగా తెలసుకున్నాకే విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.