4 జిల్లాల్లో ఈనెల 12 వరకు స్కూళ్లకు సెలవు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తం అయింది. లక్నో, నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్ నగరాలతో పాటు ఆగ్రాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు . ఇంట్లో వస్తువులన్ని తడిసిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు భారీగా కురుస్తున్న వర్షాలతో యూపీలోని రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు నీట మునిగాయి. వరి, మొక్కజొన్న, ఆలు పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.
పంట పొలాల్లో నీళ్లు నిలిచిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట పూర్తిగా నేలకొరిగింది. పంట నష్టపోయామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.