మూడు నెలలుగా అత్యాచారం

మూడు నెలలుగా అత్యాచారం
  • నిందితుడు టీఆర్ఎస్​ సర్పంచ్​ తండ్రి
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు 
  • సోషల్​ మీడియాలో వైరలవడంతో కేసు నమోదు

నాగర్​కర్నూల్/కందనూలు, వెలుగు: టీఆర్ఎస్​ సర్పంచ్​ తండ్రి ఓ మహిళను బంధించి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు సోషల్​ మీడియాలో విషయం వైరల్​కావడంతో చివరకు కేసు నమోదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన దంపతుల ఐదెకరాల భూమి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​లోని వట్టెం రిజర్వాయర్ ​కింద పోయింది. ప్రభుత్వం నుంచి రూ. 22 లక్షల పరిహారం వచ్చింది. గ్రామ సర్పంచ్ మిద్దె శ్రీశైలం తండ్రి మిద్దె బాలస్వామి(65) నిర్వాసితులైన మహిళ(32), ఆమె భర్తను తన వద్ద పనికి పెట్టుకున్నాడు. మహిళ భర్త  దగ్గర ఉన్న ట్రాక్టర్​ను బాలస్వామి లీజ్​కు తీసుకున్నాడు. నిర్వాసితులైన ఆ కుటుంబానికి ప్లాట్​ ఇప్పిస్తానని నమ్మించి రూ.18.30 లక్షలు 2020లో తన బ్యాంక్​ అకౌంట్​లోకి మార్పించుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించడం, ట్రాక్టర్​లాక్కోవడంతో మహిళ భర్త ఊరు వదిలి పారిపోయాడు. హైదరాబాద్​లో తల దాచుకున్నాడు. మహిళను లొంగదీసుకున్న బాలస్వామి బిజినేపల్లిలో ఓ రూమ్​ కిరాయికి తీసుకుని ఆమెను అక్కడ బంధించాడు.

ఆమెపై పలుసార్లు  అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి మహిళ భర్త జూలై 8న బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పట్టించుకోలేదు. ఆగస్టు 2న మహిళ స్వయంగా పోలీస్​స్టేషన్​కు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్​తండ్రి కావడంతో పోలీసులు కంప్లైంట్​ తీసుకోవడానికి వెనుకాడినట్లు సమాచారం. మహిళకు జరిగిన అన్యాయంపై సోషల్​ మీడియాలో వచ్చిన పోస్ట్​ వైరలైంది. దీంతో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి ఆదేశాలతో టీఆర్ఎస్​ మండల నాయకులు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. సర్పంచ్​ తండ్రి బాలస్వామి తప్పు చేశాడని తేలిందని ప్రకటించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఐద్వా నాయకులు జిల్లా అడిషనల్​ఎస్పీని కలిసి మహిళకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. శనివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు మిద్దె బాలస్వామిపై కేసు నమోదు చేసినట్ల బిజినేపల్లి ఎస్సై చెప్పారు.