రెండు ప్రమాదాలు.. ఇద్దరు మృతి
డ్రంకెన్ డ్రైవ్కు ఒకరు.. ఓవర్ స్పీడ్కు మరొకరు బలి
సికింద్రాబాద్, శేరిలింగంపల్లి (హైదరాబాద్), వెలుగు: రెండు కారు ప్రమాదాలు.. ఒకరు ఫుల్లుగా మందు తాగి నడిపారు.. మరొకరు అతివేగంగా తోలారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్తో రెండు ప్రాణాలను బలితీసుకున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు లేకుండా చేశారు. బుధవారం హైదరాబాద్లో ఈ ఘటనలు జరిగాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్రెండ్స్తో బయటికి వచ్చి..
హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో నివసించే ఎండీ అఫ్సర్(40).. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కందిలో స్కూల్ ఏర్పాటు చేశారు. దానికి కరస్పాండెంట్గా ఉన్నారు. ఈయన మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఫ్రెండ్స్తో కలిసి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్పేట ఫ్లైఓవర్ దగ్గర ఒక హోటల్కు వెళ్లారు. స్నేహితులు హోటల్లో ఉండగా.. అఫ్సర్ బయట రోడ్డు పక్కన బైక్ మీద కూర్చుని ఉన్నారు. 12.40 సమయంలో ఆల్విన్కాలనీ చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు వెళ్తున్న ఒక కారు.. అతి వేగంగా వచ్చి బైక్ మీద కూర్చున్న అఫ్సర్ని ఢీకొట్టింది. గమనించిన స్నేహితులు, స్థానికులు తీవ్ర గాయాలైన అఫ్సర్ని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అతిగా మందు తాగి కారు నడిపిన వ్యక్తిని బీరంగూడలో నివసించే సతీశ్గా పోలీసులు గుర్తించారు. కాంట్రాక్టర్గా పని చేస్తున్న సతీశ్.. మరో ఇద్దరితో కలిసి మంగళవారం రాత్రి మందు తాగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కారు ఢీకొన్న ఘటనలో రెండు బైక్లు, ఓ కారు ధ్వంసమయ్యాయి. ప్రమాదం తర్వాత ముగ్గురు పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అఫ్సర్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
చేస్తున్నారు.
బడికి వెళ్తుండగా..
గాంధీ ఆస్పత్రి దగ్గర్లో గిరిధర్(40) తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. బేగంపేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో మార్కెటింగ్ మేనేజర్గా పని చేస్తున్నాడు. కొడుకు కార్తికేయన్ మారేడుపల్లిలోని గీతాంజలి స్కూలులో 2వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం తన కొడుకును బైక్పై స్కూల్కు తీసుకెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బైక్ కారు కింద ఇరుక్కుపోయింది. బైక్ను కారు అలానే ఈడ్చుకుంటూ వెళ్లి ఫుట్పాత్ను ఢీకొట్టింది. దీంతో గిరిధర్, కార్తికేయన్కు తీవ్రగాయాలయ్యా యి. వెంటనే వీరిద్దరినీ అపోలో ఆసుపత్రికి తరలించగా గిరిధర్ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో రైల్నిలయం దగ్గర బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కార్తికేయన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన మహిళను సుర్గు సాగోల్ షెర్(48)గా గుర్తించారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నారు.