
ఇండోర్: ఆస్ట్రేలియాను దెబ్బకొట్టేందుకు వేసిన స్పిన్ ఉచ్చుకు టీమిండియా ఘోరంగా బలైంది. తొలి ఇన్నింగ్స్లోనే తడ‘బ్యాటు’ అనుకుంటే.. రెండో ఇన్నింగ్స్లోనూ మనోళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నేథన్ లైయన్ (8/64) టర్నింగ్ మ్యాజిక్ను అర్థం చేసుకోలేక అప్పనంగా వికెట్లు ఇచ్చుకున్నారు. దీంతో మూడో టెస్ట్లో కంగారూలు విజయం దిశగా సాగుతుండగా, ఇండియా అరుదైన ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. 88 రన్స్ తొలి ఇన్నింగ్స్ లోటుతో గురువారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్కు దిగిన ఇండియా 60.3 ఓవర్లలో 163 రన్స్కే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ముందు 76 రన్స్ స్వల్ప టార్గెట్ను ఉంచింది. చతేశ్వర్ పుజారా (142 బాల్స్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 59) మినహా అందరూ ఫెయిలయ్యారు. అంతకుముందు156/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 76.3 ఓవర్లలో 197 రన్స్కు ఆలౌటైంది. మార్నింగ్ సెషన్లో ఉమేశ్ (3/12), అశ్విన్ (3/44).. పేస్–స్పిన్ కాంబినేషన్ను దీటుగా ఎదుర్కొన్న హ్యాండ్స్కోంబ్ (19), కామెరూన్ గ్రీన్ (21) తొలి గంటలో 16 ఓవర్లు ఆడి 30 రన్స్ జోడించారు. కానీ హ్యాండ్స్కోంబ్ ఔటైన తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు. కేవలం 11 రన్స్కే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. అలెక్స్ క్యారీ (3), స్టార్క్ (1), లైయన్ (5), టాడ్ మర్ఫి (0), కునేమన్ (0 నాటౌట్) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. జడేజా 4 వికెట్లు తీశాడు.
క్యూ కట్టిన్రు..
హోల్కర్ పిచ్ పూర్తిగా స్పిన్కు అనుకూలమని తెలిసినా.. రెండో ఇన్నింగ్స్లో మనోళ్లు వికెట్లను కాపాడుకోలేకపోయారు. ఓ ఎండ్లో బాల్ను లైయన్ బొంగరంలా తిప్పుతుంటే.. కనీసం డిఫెన్స్ చేసే సాహసం కూడా చేయలేదు. లైయన్ దెబ్బకు15 ఓవర్ల లోపే ఓపెనర్లు శుభ్మన్ గిల్ (5), రోహిత్ (12) పెవిలియన్కు వచ్చేశారు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన పుజారా ఒంటరిగా పోరాడాడు. లైయన్ స్పిన్ను దీటుగా ఎదుర్కొంటూ ఒక్కో రన్ జోడించుకుంటూ వెళ్లడంతో ఇండియా మ్యాచ్లో ఉన్నట్లే కనిపించింది. కానీ రెండో ఎండ్లో ఏమాత్రం సహకారం అందలేదు. కునేమన్ (1/60) దెబ్బకు కోహ్లీ (13) ఎల్బీ కాగా, కొద్దిసేపటికే జడేజా (7) ఔటయ్యాడు. దీంతో టీ విరామానికి ఇండియా 79/4తో కష్టాల్లో పడింది. మూడో సెషన్లో శ్రేయస్ అయ్యర్ (26), పుజారా ఐదో వికెట్కు 35 రన్స్ జోడించి ఆశలు రేకెత్తించారు. కానీ స్టార్క్ (1/14) దెబ్బకు అయ్యర్ ఔట్కావడంతో ఇండియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. శ్రీకర్ భరత్ (3), అశ్విన్ (16) నిరాశపర్చారు. ఇక 57వ ఓవర్లో మిడిల్ స్టంప్ను లక్ష్యంగా చేసుకుని లైయన్ వేసిన సూపర్ టర్నర్ను పుజారా డిఫెన్స్ చేసినా.. లెగ్ స్లిప్లో స్మిత్ కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. మరో బాల్ తర్వాత ఉమేశ్ (0), నాలుగు ఓవర్ల తర్వాత సిరాజ్ (0) కూడా ఔట్కావడంతో ఇండియా మంచి టార్గెట్ను నిర్దేశించలేకపోయింది. అక్షర్ పటేల్ (15 నాటౌట్) క్రీజులో మిగిలిపోయాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 76.3 ఓవర్లలో 197 ఆలౌట్ (ఖవాజ 60, జడేజా 4/78, ఉమేశ్ 3/12), ఇండియా రెండో ఇన్నింగ్స్: 60.3 ఓవర్లలో 163 ఆలౌట్ (పుజారా 59, శ్రేయస్ 26, లైయన్ 8/64).