India Covid Cases Rise: కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. 3 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు

India Covid Cases Rise: కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. 3 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: భారత్లో కరోనా మరోసారి కల్లోలం రేపుతోంది. యాక్టివ్ కరోనా కేసులు 3వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 2వేల 710 యాక్టివ్ కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. కేరళలో 1147 కరోనా కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 యాక్టివ్ కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.

మే 26న దేశవ్యాప్తంగా 1,010 కరోనా కేసులు మాత్రమే నమోదు కాగా.. మే 30న ఈ సంఖ్య 2,710కి చేరింది. నాలుగు రోజుల వ్యవధిలోనే వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక.. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో మూడు, ఏపీలో మూడు కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కరోనా కేసులు ఇప్పటికైతే ఒక్కటి కూడా నమోదు కాలేదు.

ఇక.. కరోనా కారణంగా ఏడుగురు చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం. కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. కొత్త వైరస్ను జేఎన్.1 వేరియంట్గా వైద్యులు గుర్తించారు. ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి ఇది మార్పు చెందింది.

జేఎన్.1 వేరియంట్ లక్షణాలు:
* జ్వరం
* ముక్కు కారటం
* గొంతు నొప్పి
* తలనొప్పి
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* ఆకలి లేకపోవడం
* వికారం, విపరీతమైన అలసట
* జీర్ణాశయాంతర సమస్యలు

సాధారణంగా కనిపించే ఈ లక్షణాల నుంచి కోలుకునేందుకు 5 రోజులు పట్టొచ్చని వైద్యులు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే.. వైద్యులు మాత్రం.. ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా బయటపడుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.