
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కనీస పోరాటం కూడా చేయకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 3 వికెట్ల నష్టానికి 430 పరుగులతో 600 పరుగుల దిశగా అడుగులేసిన భారత్.. ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 147 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రిషబ్ పంత్ (134), జైశ్వాల్ (105) సెంచరీలతో చెలరేగారు.
రాహుల్ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. భారత జట్టులో ముగ్గురు డకౌటయ్యారు. 7 వికెట్ల నష్టానికి 454 పరుగులతో చివరి రెండో సెషన్ ప్రారంభించిన భారత్.. మరో 17 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లీష్ పేసర్ జోష్ టంగ్ విజృంభించి చివరి మూడు వికెట్లను పడగొట్టాడు. బుమ్రా డకౌట్ కాగా.. ప్రసిద్ కృష్ణ ఒక పరుగు మాత్రమే చేశాడు. జడేజా 11 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, స్టోక్స్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. బషీర్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు.
సెంచరీతో హోరెత్తించిన పంత్:
3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. తొలి గంటలో గిల్, పంత్ జాగ్రత్తగా ఆడడంతో ఇంగ్లాండ్ కు వికెట్ ఏమీ రాలేదు. ఓ వైపు గిల్ డిఫెన్స్ కు పరిమితం కాగా.. మరో ఎండ్ లో పంత్ వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పంత్ సిక్సర్ తో 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో ఒక్కసారిగా భారత్ కుప్పకూలింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో గిల్ (147) బషీర్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీదుగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
8 ఏళ్ళ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ డకౌటయ్యాడు. స్టంప్స్ కు దూరంగా వేసిన స్టోక్స్ బంతిని కరుణ్ షాట్ ఆడగా.. పోప్ డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. సెంచరీ చేసి ఊపు మీద కనిపించిన పంత్ (134) టంగ్ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీకి ఔటయ్యాడు. లంచ్ చివరి ఓవర్ ముందు శార్దూల్ (1) ను స్టోక్స్ ఔట్ చేయడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.
India slide from 430/3 to 471 all out 👀https://t.co/ShJazRf4lJ | #ENGvIND pic.twitter.com/bsLQJNhdto
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2025