హైదరాబాద్, వెలుగు : ఇండియా కూటమి పేరు వినగానే కేంద్రంలోని బీజేపీ వణుకుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అర్జెంట్ గా ఇండియా పేరును భారత్ అని మార్చాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రతిపక్షాల ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత కేంద్రం ఇండియా అనే మాటను కనపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
జీ20 సమావేశాల గుర్తు కూడా కమలం పెట్టారని ఆయన మండిపడ్డారు. బిగ్ బాస్ సంస్కృతి చెడుమార్గాలకు దారి తీస్తుందన్నారు. తద్వారా యువతకు ఆదర్శవంతమైన దారి కనిపించదని ఆవేదన వ్యక్తం చేశారు. అలహాబాద్ కోర్ట్ తీర్పు ఆధారంగా ఎవ్వరూ బిగ్ బాస్ కార్యక్రమంపై కేసు నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. బిగ్ బాస్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి దాన్ని నిషేధించాలని కోరారు.