- ఢిల్లీలో ప్రధాని మోదీతో వెనెజువెలా ప్రెసిడెంట్ డెల్సీ భేటీ
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో కలిసి ముందుకు సాగాలని భారత్, వెనెజువెలా దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఆర్థిక రంగంలోనూ మరింత సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. ఐదు రోజుల భారత పర్యటనకు వచ్చిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, క్రిటికల్ మినరల్స్, ఖనిజ వనరుల అన్వేషణలో సహకారం, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బ్రిక్స్ కూటమి, ఇతర అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
చమురు అన్వేషణ, ఉత్పత్తి, శుద్ధి (రిఫైనింగ్) రంగాల్లో కలిసి పనిచేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. చర్చల్లో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కు వెవెజువెలా నుంచి రావాల్సిన 500 మిలియన్ అమెరికన్ డాలర్ల డివిడెండ్ల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ విషయంపై వెనెజువెలా సున్నితంగా స్పందించిందని అధికారులు తెలిపారు. ఇంధన రంగంతో పాటు క్రిటికల్ మినరల్స్, బంగారం, వజ్రాలు వంటి ఖనిజ వనరుల అన్వేషణ, మైనింగ్లో సహకారం సాధ్యాసాధ్యాలపై కూడా చర్చలు జరిగాయి. అలాగే ఔషధ రంగం, ఆటోమొబైల్ పరిశ్రమల్లో సహకార అవకాశాలను కూడా ఇరు పక్షాలు పరిశీలించాయి.
నేడు గుజరాత్, డామన్లలో మోదీ పర్యటన
ప్రధాని మోదీ శుక్రవారం గుజరాత్, డామన్లో పర్యటించి, రూ. 22,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సూరత్లో రూ. 18,800 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
