ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీకి అడ్డాగా ఇండియా.. మేడిన్ చైనాకు టైం అయిపోయిందా..!

ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీకి అడ్డాగా ఇండియా.. మేడిన్ చైనాకు టైం అయిపోయిందా..!

ఆపిల్ ఫోన్లతో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల తయారీకి అడ్డగా ఇండియా మారింది. ఒకప్పుడు చైనా కేంద్రంగా జరిగిన ఈ ఉత్పత్తి ప్రస్తుతం ఇండియాకు షిఫ్ట్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టకుమునుపే చాలా కంపెనీలు కళ్లు తెరిచాయి. అయితే ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ ప్రకటించిన తర్వాత భారతదేశంలో కార్యకలాపాల విస్తరణ వేగవంతం చేయబడింది.

ప్రస్తుతం ఆపిల్ సంస్థ తమ ఐఫోన్లను అమెరికా మార్కెట్ల కోసం ఇండియాలోనే సిద్ధం చేస్తోంది. చైనా నుంచి దిగుమతి సుంకాల వల్ల ఖరీదైనదిగా మారటంతో ఆపిల్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశం నుంచి ఆపిల్ ఎగుమతలు భారీగా పెరిగాయి. ఇదే క్రమంలో మరిన్ని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రస్తుతం తమ ఉత్పత్తుల తయారీ ఎగుమతికి ఇండియాను అడ్డాగా మార్చుకున్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ సంస్థలైన శాంసంగ్, మోటోరోలా కూడా అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు మేడిన్ ఇండియా మెుబైల్స్ ఎగుమతి చేస్తున్నాయి. లెనోవా బ్రాండ్ యజమాని మోటోరోలా 2025 మెుదటి 5 నెలల కాలంలో భారతదేశంలో 16 లక్షల స్మార్ట్ ఫోన్లను తయారు చేసి ఎగుమతి చేసింది. వీటిలో 99 శాతం ఫోన్లు అమెరికా మార్కెట్లకు వెళ్లాయి. 2024లో ఈ సంఖ్య 10 లక్షల స్మార్ట్ ఫోన్లుగా ఉంది. కంపెనీ భారతీయ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ సహాయంతో ఉత్పత్తిని చేపడుతోంది. 

AALSO READ | Yamaha: Rx100 బైక్ లవర్స్‌కి షాకిచ్చిన యమహా.. ఇకపై ఆ బండ్లు ఇండియాలో అమ్మరు..

అమెరికా చైనా నుంచి దిగుమతులపై 55 శాతం, భారత్ నుంచి దిగుమతులపై 26 శాతం సుంకం విధిస్తున్నందున చాలా సంస్థలు తమ ఉత్పత్తిని ఇండియాలో పెంచాయి. ఇదే క్రమంలో శాంసంగ్ సంస్థ జనవరి నుంచి మే మధ్య కాలంలో అమెరికాకు 9లక్షల 45వేల మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసింది. వియత్నాం కంటే ఇండియాపై తక్కువ పన్నులు ఉండటంతో శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుందని తేలింది. 

పెరుగుతున్న ఉత్పత్తి డిమాండ్లకు అనుగుణంగా తమ ప్లాంట్ విస్తరిస్తున్నట్లు డిక్సన్ టెక్నాలజీస్ వెల్లడించింది. ప్రధానంగా నార్త్ అమెరికాకు ఎగుమతిని పెంచేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి తోడు ప్రొడక్షన్ ఆధారిత ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వేళ స్మార్ట్ ఫోన్ల తయారీకి హబ్ గా భారత్ మారుతోందని నిపుణులు చెబుతున్నారు. భారత్ నుంచి ఆఫ్రికా, యూఏఈ వంటి దేశాలకు కూడా స్మార్ట్ ఫోన్ల ఎగుమతి కొనసాగుతోంది. ఇదే క్రమంలో శాంసంగ్, మోటోరోలా, నోకియా, ట్రాన్షన్ సంస్థలు కూడా తమ తయారీని ఇండియాలో పెంచుతున్నాయి. 

చైనాకు సంబంధించిన వివో సంస్థ కూడా భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభించింది. వివో ప్రధానంగా థాయ్ లాండ్ దేశానికి వీటిని షిప్పింగ్ చేస్తోందని తేలింది. అలాగే ట్రాన్షన్ గ్రూప్ ఇన్ఫినిక్స్, టెక్నో, ఐటెల్ వంటి బ్లాండ్ల కింద తన ఉత్పత్తును ఇండియా నుంచి ప్రపంచానికి అందిస్తోంది. ఇదే క్రమంలో గూగుల్ తన పిక్సిల్ మెుబైళ్ల తయారీకి ఇండియాలో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోందని తేలింది.