Yamaha: Rx100 బైక్ లవర్స్‌కి షాకిచ్చిన యమహా.. ఇకపై ఆ బండ్లు ఇండియాలో అమ్మరు..

Yamaha: Rx100 బైక్ లవర్స్‌కి షాకిచ్చిన యమహా.. ఇకపై ఆ బండ్లు ఇండియాలో అమ్మరు..

Yamaha Motors: కుర్రోళ్లను ఆకట్టుకునే బైకులు తయారు చేయటంలో యమహా పేరొందింది. ఈ సంస్థ ఎక్కువగా అధిక సీసీ కలిగిన రేసింగ్ బండ్ల కేటగిరీలో ఫేమస్ అయ్యింది. అయినప్పటికీ తక్కువ సీసీ ఇంజన్లు కలిగిన స్కూటీలు, టూవీలర్లకు కంపెనీ పెట్టింది పేరు. వాటి ఇంజన్ పనితీరు, పవర్ యమహా బళ్లకు డిమాండ్ పెంచింది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో యువత ఆర్ఎక్స్ 100 మోడల్ బళ్లపై మనసు పారేసుకుంటున్నారు. ఒక క్లాసిక్ కలెక్షన్ గా దానిని చాలా మంది భావిస్తున్నారు.

అయితే తాజాగా యమహా కంపెనీ తీసుకున్న నిర్ణయం భారతీయులను షాక్ కి గురిచేస్తోంది. కంపెనీ తన 100 సీసీ, 125 సీసీ మోడళ్ల తయారీ విక్రయాలను భారత మార్కెట్లో నిలిపివేస్తున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని యమహా ఇండియాలో సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ ధృవీకరించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా తమ భవిష్యత్తు ఉత్పత్తి ప్రణాళికలు కొనసాగుతున్నాయని.. ఇందులో టెక్నాలజీ, స్టైల్ పై తమ ఫోకస్ ఉందని ఆయన వెల్లడించారు. 

ప్రస్తుతం కంపెనీ మైలేజీ, అఫోర్డబిలిటీ అనే రెండు ప్రాతిపధికలను విడిచి యువత కోరికలకు, అవసరాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తుల వైపు మళ్లుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఒకప్పుడు కంపెనీ యమహా క్రక్స్ ఉండేది కానీ ప్రస్తుతం ఉన్న ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లలో దానిని కొనసాగించటం కుదరదని పేర్కొంది. ఈ కేటగిరీలో హీరో, బజాజ్, హోండ్ వంటి సంస్థల ఉత్పత్తులు ఉన్నాయని చెప్పింది.

అయితే యమహా కమ్యూటర్ టూవీలర్లను విదేశీ మార్కెట్ల కోసం మాత్రం ఉత్పత్తిని కొనసాగిస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ భారత మార్కెట్ల కోసం 300 సీసీ కంటే ఎక్కువ పవర్ కలిగిన మోడల్ బైక్స్ తయారు చేసే పనిలో బిజీగా ఉంది. యమహా ఇండియా త్వరలో MT-07, R7, MT-09, Ténéré 700 వంటి మోడళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఉత్పత్తులతో పాటు, యమహా తన బ్యాకెండ్ సేవలను కూడా ప్రీమియమైజ్ చేయడంపై పని చేస్తోంది. దీనికి అనుగుణంగా కంపెనీ ఫ్యాక్టరీల నుంచి షోరూమ్స్ వరకు అన్నింటిని అప్ గ్రేడ్ చేస్తోందని వెల్లడైంది. 

భారత మార్కెట్లలోకి యమహా ప్రవేశించి దశాబ్ధాలు గడిచింది. కంపెనీ ఇండియా నుంచి దాదాపు 50 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. యమహా తన చెన్నై ఫ్యాక్టరీ నెలకొల్పి ఇటీవలే 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ కాలంలో అక్కడ 50 లక్షల ద్విచక్ర వాహనాలను తయారు చేసింది. ప్రస్తుతం కంపెనీ తీసుకున్న నిర్ణయంతో వాల్యూమ్‌ను వదులుకోవచ్చు, కానీ బ్రాండ్ కోసం స్పష్టత సాధించడం ద్వారా ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.