తగ్గనున్న వంట నూనెల ధరలు?

తగ్గనున్న వంట నూనెల ధరలు?

ఇంపోర్ట్​ డ్యూటీ కుదింపు
పరిశీలనలో ప్రపోజల్​

న్యూఢిల్లీ: వంట నూనెల రేట్లను కిందికి తెచ్చేందుకు ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వంట నూనెల రేట్లు కిందటి నెలలో రికార్డు లెవెల్​కి చేరడంతో డ్యూటీ తగ్గింపు ప్లాన్​ చేస్తోంది. ఇద్దరు సీనియర్​ గవర్నమెంట్​ ఆఫీసర్లు, పరిశ్రమ ప్రతినిధులు ఈ విషయం వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ​ తెలిపింది. ఫైనల్​ డెసిషన్​ ఇంకా తీసుకోలేదు. డ్యూటీ తగ్గిస్తే లోకల్​ రేట్లు దిగి రావడంతోపాటు, వాడకం​ పెరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచన. ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గిస్తే మలేషియా పామాయిల్​కు మేలు జరిగినట్లే. ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతి చేసుకునేది మలేషియా, ఇండోనేషియాల నుంచే. అంతేకాదు, డ్యూటీ తగ్గింపు వల్ల దేశీయంగా ఆవాలు, సోయాబీన్​, వేరుశనగల రేట్లు కూడా కిందకి వస్తాయి. వంట నూనెల దిగుమతులపై డ్యూటీ తగ్గింపు ప్రపోజల్​ రివ్యూ చేస్తున్నట్లు సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. ఫైనల్​ డెసిషన్​ను గవర్నమెంటు ఈ నెలలోనే తీసుకోనుందని కన్జూమర్​ ఎఫెయిర్స్‌‌​ మినిస్ట్రీ అధికారి పేర్కొన్నారు. డ్యూటీ తగ్గింపు రివ్యూ ప్రపోజల్​ డిస్కషన్స్​​లో ఈ మినిస్ట్రీ కూడా ఉంది. వంట నూనెల రేట్లు  గత ఏడాది కాలంలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. కరోనా దెబ్బకి ఓవైపు ఆదాయం తగ్గితే, మరోవైపు  పెట్రోల్​, డీజిల్​ రేట్ల మోతతో ఇబ్బందులెదుర్కొంటున్న జనం, వంట నూనెల మంటతో  మరింత చిక్కుల్లో పడ్డారు. వంట నూనెల అవసరాల కోసం మూడింట రెండొంతులు దిగుమతుల మీదే మన దేశం ఆధారపడుతోంది. పామాయిల్​ దిగుమతులపై డ్యూటీ ప్రస్తుతం 32.5 శాతం ఉండగా, సోయాబీన్​, సోయా ఆయిల్​పై 35 శాతం విధిస్తున్నారు. పామాయిల్​ ఇండోనేషియా, మలేషియాల నుంచి వస్తుండగా, సోయా ఆయిల్​, సన్​ఫ్లవర్​ నూనెలు ఆర్జంటీనా, బ్రెజిల్​, ఉక్రెయిన్​, రష్యా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
క్రూడ్​ పామాయిల్ రేటు డబుల్​....
ఈ ఏడాది ఏప్రిల్​లో క్రూడ్​ పామాయిల్ ఇండియా పోర్టులకు వచ్చేటప్పటికి టన్ను రేటు 1,173 డాలర్లు . అంతకు ముందు ఏడాది ఈ రేటు 599 డాలర్లు మాత్రమేనని సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్టర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (సీ) డేటా వెల్లడిస్తోంది. వంట నూనెల రేట్లు తగ్గడానికి ప్రభుత్వం కిందటి వారం పెట్టిన మీటింగ్​లో సీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. టాక్సుల ద్వారా వచ్చే రెవెన్యూతో కన్జూమర్లకు వంట నూనెలపై సబ్సిడీ ఇవ్వమని ఈ మీటింగ్​లో  ప్రపోజల్​ పెట్టినట్లు సీ ప్రతినిధి బీ వీ మెహతా చెప్పారు. పేద ప్రజలకు తక్కువ రేటుకే వంట నూనెలను ప్రభుత్వం ఇవ్వొచ్చని, ఇందుకు ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఖరీఫ్ నాట్లు చూశాకే....
వంట నూనెల ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గింపు ప్రపోజల్​పై డిస్కషన్స్​లో ఖరీఫ్​ పంట సాగు విస్తీర్ణం చూసి, అప్పుడే  డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నట్లు మరో సీనియర్​ గవర్నమెంటు ఆఫీసర్​ చెప్పారు. మరో ఆలోచన ఏమంటే, డ్యూటీ తగ్గించి, ఎఫెక్ట్​ ఎలా ఉంటుందో చూడాలనేదని పేర్కొన్నారు.​ ఎందుకంటే, డ్యూటీ తగ్గించాక సప్లయర్లు తమ రేట్లు పెంచే రిస్క్​ కూడా ఉంటుందని చెప్పారు. వంట నూనెలపై ఇంపోర్ట్​ డ్యూటీ తగ్గింపును దేశీయ పరిశ్రమ రంగంలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల విదేశీ సప్లయర్లకే మేలు కలుగుతుందని, దేశంలో నూనె గింజలు సాగు చేసే రైతులకు నిరుత్సాహం కలిగిస్తుందనేది వారి వాదన. డ్యూటీ తగ్గిస్తే, మన రైతులు పంట సాగు విస్తీర్ణం పెంచడానికి ఇష్టపడకపోవచ్చని కన్జూమర్​ ఎఫెయిర్స్​ మినిస్ట్రీ అధికారి చెప్పారు. రెవెన్యూ పరంగా ప్రభుత్వానికి ఇబ్బందులు లేవని, అవి కిందటేడాది లెవెల్​లోనే ఉంటాయని అన్నారు.  గత ఏడాది కాలంగా వంట నూనెల రేట్లు పెరిగాయి కాబట్టి, రెవెన్యూ సమస్య రాదని పేర్కొన్నారు.