దేశంలో 74 రోజులకు సరిపడా పెట్రోలియం నిల్వలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో 74 రోజులకు సరిపడా పెట్రోలియం నిల్వలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • పెట్రో ఉత్పత్తులపై విపక్షాలది అసత్య ప్రచారం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, భారత్‌‌‌‌ ఇంధన భద్రత విషయంలో అత్యంత పటిష్టంగా ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్‌‌‌‌ రెడ్డి తెలిపారు. దేశంలో పెట్రో ఉత్పత్తుల కొరత ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో 74 రోజులకు అవసరమైన పెట్రోలియం నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

విశాఖపట్నం, మంగళూరు, పదూర్‌‌‌‌ ప్రాంతాల్లోని భూగర్భ నిల్వలు ఎలాంటి విపత్కర పరిస్థితునైనా ఎదుర్కోగలవని పేర్కొన్నారు. గతంలో కేవలం 27 దేశాల నుంచే ముడి చమురు దిగుమతి అయ్యేదని.. కానీ, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ సంఖ్యను 40 దేశాలకు పెంచి, ఇంధన సరఫరాలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుందని వెల్లడించారు. సముద్ర రవాణాలో భారతీయుల భద్రతకు తాము ‘జీరో టోలరెన్స్‌‌‌‌’ పాటిస్తున్నామని మంత్రి తెలిపారు.

హర్ముజ్ జలసంధి గుండా భారత జెండా ఉన్న నౌకలను ఆపబోమని ఇరాన్ స్పష్టం చేయడం దేశ దౌత్య విజయమని ఆయన కొనియాడారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశంలోని రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని, ఎల్‌‌‌‌పీజీ ఉత్పత్తిని కూడా 25 శాతం పెంచామని చెప్పారు. గత యూపీఏ పాలనలో భారత్ బలహీన ఆర్థిక వ్యవస్థ కలిగిన ‘ఫ్రాజైల్-5’ జాబితాలో ఉండేదని పేర్కొన్నారు.

నాటి పాలకులు పెట్రోల్ బంకులు మూసివేయాలని సూచించేవారని,  కానీ, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగిందని వెల్లడించారు. ప్రతిపక్షాలు అసత్య వార్తలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని, ఇలాంటి చర్యలు పరోక్షంగా బ్లాక్ మార్కెట్‌‌‌‌కు సహకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

మద్దతు ధరతో పంటల కొనుగోలు..

తెలంగాణ రైతులు పండించిన 1,25,855 మెట్రిక్‌‌‌‌ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను రూ. 894 కోట్లకు పైగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌‌‌పీ) చెల్లించి కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై కిషన్‌‌‌‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ పెట్టారు.