
న్యూఢిల్లీ: వర్షాలతో డిమాండ్ తగ్గడంతో మన దేశానికి రష్యన్ చమురు దిగుమతి ఆగస్టులో ఏడు నెలల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన ఇండియా, ఆగస్టులో వరుసగా మూడవ నెలలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకుంది. ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా డేటా ప్రకారం, ఆగస్టులో రష్యా నుంచి రోజుకు 1.46 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి అయ్యాయి. అంతకుముందు నెలలో కొనుగోలు చేసిన 1.91 మిలియన్ బ్యారెల్స్ కంటే ఇది చాలా తక్కువ. భారతీయ రిఫైనర్లు ఇరాక్ నుంచి దిగుమతులను 8,91,000 బీపీడీ (బ్యారెల్స్ పర్ డే) నుంచి రోజుకు 8,66,000 బ్యారెళ్లకు తగ్గించారు.
సౌదీ అరేబియా నుంచి దిగుమతులు జులైలో 4,84,000 బీపీడీ నుంచి 8,20,000 బీపీడీలకు పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా -–ఉక్రెయిన్ వివాదం ప్రారంభమయ్యే ముందు భారతదేశం దిగుమతుల్లో ఒక శాతం కంటే తక్కువ మార్కెట్ వాటా ఉన్న రష్యన్ ఆయిల్ దిగుమతులు మేలో 2 మిలియన్ల బీపీడీ గరిష్ట స్థాయికి చేరాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై మాస్కో దాడి చేసిన తరువాత, రష్యా చమురును యూరప్, కొన్ని ఆసియా దేశాలు కొనడం లేదు. దీంతో రష్యా క్రూడ్ను తక్కువ ధరకు అమ్ముతోంది. గత సంవత్సరం మధ్యలో బ్యారెల్ను 30 డాలర్లకు అమ్మింది. భారతీయ రిఫైనర్లు రష్యా క్రూడ్ను విపరీతంగా కొన్నారు. ఈవీలు పెరిగిపోవడంతో చైనా పెద్దగా కొనడం లేదు.
భారతీయ రిఫైనర్లు ఉక్రెయిన్ యుద్ధానికి ముందు కాలంలో వారి మొత్తం కొనుగోళ్లలో రష్యా ఆయిల్ వాటా 2 శాతం కంటే తక్కువ ఉండేది. ఇది ఇప్పుడు 33 శాతానికి పెరిగింది. యూఏఈ నుంచి భారతదేశ చమురు దిగుమతులు కూడా గత నెలలో 2,90,000 బీపీడీల నుంచి ఆగస్టులో 2,73,000 బీపీడీలకు పడిపోయాయి. అమెరికా నుంచి కొనుగోళ్లు కూడా జులైలో 2,19,000 బీపీడీల నుంచి 1,60,000 బీపీడీలకు తగ్గాయి. భారతదేశం మొత్తం ముడి దిగుమతులు ఆగస్టులో 7 శాతం క్షీణించి, రోజుకు 4.35 మిలియన్ డాలర్లు బ్యారెల్స్కు తగ్గాయి. ప్రస్తుతం డిమాండ్ కొంచెం తక్కువగా ఉందని, పండగ సీజన్ మొదలయ్యాక పెరుగుతుందని రిఫైనర్లు చెబుతున్నారు. ఇరాక్ నుంచి భారతదేశం దిగుమతులు ఆగస్టులో నెలవారీగా చూస్తే పెద్దగా మారలేదు. సౌదీ అరేబియా 55 శాతానికి పైగా పెరిగాయి