దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. 2024 జనవరి 04 గురువారం ఒక్క రోజునే దేశవ్యాప్తంగా కొత్తగా 761 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1,249 యాక్టివ్ కేసులు నమోదు కాగా కర్ణాటకలో 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్గఢ్ లో 128 కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 12 మరణాలు నమోదయ్యాయి.
కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,385కి చేరుకుంది. ఇక దేశంలో నిన్న ఒక్కరోజే 838 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 4,44,78,885కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,334 యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి 3వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 541కి పెరిగాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతూనే ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ లు ధరించాలని, శుభ్రత పాటించాలని చెబుతున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించిన వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరిస్తున్నారు.