
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగులకు ఆలౌట్ అయింది. 276/6 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత జట్టు..కొద్దిసేపటికే 7వ వికెట్ కోల్పోయింది. తొలి రోజు 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్..86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ సమయంలో అశ్విన్, కుల్దీప్ యాదవ్ జట్టుకు అండగా నిలిచారు. ఈ ఇద్దరు బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 8వ వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
అశ్విన్ హాఫ్ సెంచరీ..ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడాడు. కుల్దీప్ తో కలిసి మంచి పాట్నర్ షిప్ నమోదు చేస్తూనే..హాఫ్ సెంచరీ చేశాడు. 113 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు సాధించాడు. ఇదే క్రమంలో 385 పరుగుల వద్ద పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 40 పరుగులు చేసిన కుల్దీప్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. చివర్లో ఉమేష్ యాదవ్ కొద్దిసేపు బ్యాట్ ఝుళిపించాడు. 10 బంతుల్లోనే 15 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సలుండటం విశేషం. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, మెహ్ దీ హసన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఖలీద్ అహ్మద్, ఎబాడోట్ హొస్సేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.