కొత్త ఆరంభం ..ఇవాళ్టి(జూన్ 20) నుంచి ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ తొలి టెస్ట్‌‌‌‌

కొత్త ఆరంభం ..ఇవాళ్టి(జూన్ 20) నుంచి ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌ తొలి టెస్ట్‌‌‌‌
  • ఉత్సాహంలో యంగ్‌‌‌‌ టీమిండియా
  • అనుభవజ్ఞులతో ఇంగ్లిష్‌‌‌‌ జట్టు
  • మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌–1, 5, జియో సినిమాలో లైవ్‌‌‌‌

లీడ్స్‌‌‌‌: కొత్త కెప్టెన్‌‌‌‌.. ధృడమైన కోచ్‌‌‌‌.. పాత జట్టులో నుంచి ఒకరిద్దరు.. మిగతా అంతా కొత్త ముఖాలు.. ఈ నేపథ్యంలో ఇండియా యంగ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌ కొత్త ఆరంభానికి రెడీ అయ్యింది. పాత తరాన్ని (పటౌడీ ట్రోఫీ) మైమరిపిస్తూ కొత్తగా రూపాంతరం చెందిన అండర్సన్‌‌‌‌–టెండూల్కర్‌‌‌‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌‌‌‌తో ఐదు టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. గత తొమ్మిది దశాబ్దాలలో 1971లో అజిత్‌‌‌‌ వాడేకర్‌‌‌‌ బ్యాచ్‌‌‌‌, 1986లో కపిల్‌‌‌‌ డెవిల్స్‌‌‌‌, 2007లో రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ బృందం మాత్రమే ఇంగ్లండ్‌‌‌‌ గడ్డపై టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లు గెలిచాయి. ఆ తర్వాత ఏ జట్లూ ఈ ఘనత సాధించలేదు. గత పదేళ్లలో ఇండియా టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌కు ఐకాన్లుగా ఉన్న విరాట్‌‌‌‌ కోహ్లీ, రోహిత్‌‌‌‌ శర్మ రిటైర్మెంట్‌‌‌‌తో అతిపెద్ద శూన్యం ఆవరించింది. దాంతో ఇండియా బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌లో అనుభవం తక్కువగా కనిపిస్తోంది. బ్రెండన్‌‌‌‌ మెకల్లమ్‌‌‌‌ కోచింగ్‌‌‌‌లో బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ సంప్రదాయాలను తుడిచి పెట్టేసింది. ఇలాంటి టైమ్‌‌‌‌లో ఇంగ్లిష్‌‌‌‌ జట్టును ఓడిస్తే యంగ్‌‌‌‌ టీమిండియా స్థాయి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. కొత్త కెప్టెన్‌‌‌‌ 25 ఏళ్ల శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ భవిష్యత్‌‌‌‌కు ఈ సిరీస్‌‌‌‌ అత్యంత ప్రధానం కాబోతున్నది. బ్యాటర్‌‌‌‌గా ఏం చేస్తాడనే దానిని కాసేపు పక్కనబెడితే టీమిండియా 37వ కెప్టెన్‌‌‌‌గా గిల్‌‌‌‌ జట్టును ఏ మేరకు నడిపిస్తాడన్నదే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బజ్‌‌‌‌బాల్‌‌‌‌కు అనుకూలం కాదు..

తొలి టెస్ట్‌‌‌‌కు వేదికైన లీడ్స్‌‌‌‌లో ఉష్ణోగ్రత 29 డిగ్రీల వరకు ఉంది. 22 గజాల పిచ్‌‌‌‌పై 8 మిల్లీ మీటర్ల గడ్డి ఉంది. కాబట్టి ఈ వికెట్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌ బజ్‌‌‌‌బాల్‌‌‌‌ స్ట్రాటజీకి అనుకూలం కాదు. అయితే ముందుగా బ్యాటింగ్‌‌‌‌ చేసే జట్టు ఒత్తిడిని భరించడంపైనే ఈ సిరీస్‌‌‌‌ విజయం ఆధారపడి ఉంటుంది. 36 సెంచరీలతో కలిపి 13 వేల రన్స్‌‌‌‌ చేసిన జో రూట్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌కు కొండంత అండ.  టీమిండియాలో కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (58 టెస్ట్‌‌‌‌లు, 3257 రన్స్‌‌‌‌) మినహా మిగతా బ్యాటర్లకు అనుభవం లేదు. కాకపోతే బౌలింగ్‌‌‌‌లో అసమానమైన జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా ఉండటం ఇండియాకు తిరుగులేని బలాన్నిస్తోంది. బుమ్రా మూడు టెస్ట్‌‌‌‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు కాబట్టి తొలి మ్యాచ్‌‌‌‌ నుంచే పోరాటం మొదలుపెట్టాలి. 

ఆ నలుగురు లేరు..

2021 సిరీస్‌‌‌‌లో అత్యుత్తమ టెస్ట్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడిన కోహ్లీ, రోహిత్‌‌‌‌తో పాటు ఇంగ్లండ్‌‌‌‌ పేస్‌‌‌‌ లెజెండ్స్‌‌‌‌ అండర్సన్‌‌‌‌, స్టువర్ట్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌ ఇప్పుడు జట్టులో లేరు. దాంతో ఇండియా బ్యాటింగ్‌‌‌‌లో, ఇంగ్లండ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో నాణ్యత చాలా వరకు తగ్గింది. ఇంగ్లిష్ బౌలింగ్‌‌‌‌పై కుర్రాళ్లు ఒత్తిడి పెంచితే సిరీస్‌‌‌‌పై ఆశలు పెంచుకోవచ్చు. క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ మినహా, బ్రైడన్‌‌‌‌ కార్సీ, జోష్‌‌‌‌ టంగ్‌‌‌‌, షోయబ్‌‌‌‌ బషీర్‌‌‌‌, స్టోక్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ నుంచి పెద్దగా ప్రమాదం పొంచి ఉండకపోవచ్చు. కోహ్లీ, రోహిత్‌‌‌‌ నిష్క్రమణ తర్వాత జట్టులో అత్యంత శక్తివంతంగా మారిన హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ ఖాతాలో ఇప్పటికే ఆరు పరాజయాలు ఉన్నాయి. ఈ రికార్డును మెరుగుపర్చుకోవాలని భావిస్తున్న గౌతీ వ్యూహాత్మక చతురతకు ఇది తొలి పరీక్ష.

కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ రీ ఎంట్రీ !

ఈ మ్యాచ్‌‌‌‌ తుది జట్టుపై కాస్త డైలమా నెలకొన్నా.. కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ రీ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లీ ప్లేస్‌‌‌‌ను గిల్‌‌‌‌ భర్తీ చేస్తాడని క్లారిటీ వచ్చింది. అయితే మూడో ప్లేస్‌‌‌‌పై కొనసాగుతున్న సందిగ్ధతకు నాయర్‌‌‌‌తో చెక్‌‌‌‌ పెట్టొచ్చు. ట్రెయినింగ్‌‌‌‌ సెషన్స్‌‌‌‌లో నాయర్‌‌‌‌ ఎక్కువగా స్లిప్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ చేయడం కూడా ఇందుకు ఓ కారణంగా తెలుస్తోంది.  గౌతీ ఎక్స్‌‌‌‌ట్రా బ్యాటర్‌‌‌‌తో వెళ్తే  సాయి సుదర్శన్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ దక్కొచ్చు. లేదంటే ఆల్‌‌‌‌రౌండర్స్‌‌‌‌ నితీశ్‌‌‌‌ రెడ్డి, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌లో ఒకర్ని ఆడిస్తారేమో చూడాలి. పిచ్‌‌‌‌తో సంబంధం లేకుండా చైనామన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను ఆడించాలనే ప్రతిపాదన కూడా వస్తోంది. కానీ బ్యాటింగ్‌‌‌‌ పరంగా చూస్తే జడేజాకు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. పరిస్థితులను బట్టి మూడో సీమర్‌‌‌‌గా అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణలో ఒకర్ని తీసుకున్నా ఆశ్చర్యం లేదు. బుమ్రా, సిరాజ్‌‌‌‌కు సరైన కాంబినేషన్‌‌‌‌గా నిలుస్తున్న ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌ ఎంపికను కూడా మర్చిపోవద్దు. ఓవరాల్‌‌‌‌గా గంభీర్‌‌‌‌ తీసుకునే నిర్ణయాలు ఆరున్నర వారాల్లో టీమిండియా ఆట తీరును కచ్చితంగా నిర్వచిస్తాయి. 

బ్యాటింగ్‌‌‌‌ వైపు ఇంగ్లండ్ మొగ్గు..

ఈ మ్యాచ్‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌ తుది జట్టును ప్రకటించింది. స్టోక్స్‌‌‌‌, మెకల్లమ్‌‌‌‌ పూర్తిగా బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌ వైపు మొగ్గారు. వోక్స్‌‌‌‌ 8వ స్థానంలో ఆడనున్నాడు. అయితే బుమ్రా, సిరాజ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను  క్రాలీ, డకెట్ ఎలా ఎదుర్కొంటారన్న దాన్ని బట్టి సిరీస్‌‌‌‌ ఆరంభం ఆధారపడి ఉంటుంది. మిగతా లైనప్‌‌‌‌ సంగతి ఎలా ఉన్నా రాబోయే మూడు మ్యాచ్‌‌‌‌లు మాత్రం బుమ్రా వర్సెస్‌‌‌‌ రూట్‌‌‌‌గా సాగనున్నాయి. 

జట్లు 

ఇండియా: యశస్వి జైస్వాల్‌‌‌‌, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ / నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ / కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, బుమ్రా, సిరాజ్‌‌‌‌. 
ఇంగ్లండ్‌‌‌‌: జాక్‌‌‌‌ క్రాలీ, బెన్‌‌‌‌ డకెట్‌‌‌‌, ఒలీ పోప్‌‌‌‌, జో రూట్, హ్యారీ బ్రూక్‌‌‌‌, బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), జెమీ స్మిత్‌‌‌‌, క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌, బ్రైడన్‌‌‌‌ కార్సీ, జోష్‌‌‌‌ టంగ్‌‌‌‌, షోయబ్‌‌‌‌ బషీర్‌‌‌‌.