హైదరాబాద్ ఉప్పల్ వేదికగా 18న జరగనున్న ఇండియా – న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్లో పెట్టిన అరగంటలోపే వేలాది టికెట్లు సేల్ అయ్యాయి. ఈ మ్యాచ్ కోసం 14న 6 వేల టికెట్లు, 15న 7 వేల టికెట్లు ఆన్లైన్లో అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఆన్లైన్లో 20వేల టికెట్లను హెచ్సీఏ అధికారులు విక్రయించారు. పేటీఎం ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. టికెట్స్ విక్రయాలు జరుగుతున్న సమయంలో సైట్ సరిగా పనిచేయడం లేదని క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరో 9417 టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. మరోవైపు హెచ్సీఏ తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అయితే, ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఇవాళ్టి నుంచి ఫిజికల్ టికెట్స్ ఇవ్వనున్నారు. దీనికోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు మెసేజ్ చూపించిన వారినే స్టేడియంలోపలికి అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 8 కౌంటర్లు, 75 మంది పోలీసులు, గచ్చిబౌలి స్టేడియంలో 8 కౌంటర్లు, 80 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ చూపిస్తే.. స్కాన్ చేసి పేటీఎం సిబ్బంది ఫిజికల్ టికెట్లను ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మరో 7 వేల టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్సీఏ వెల్లడించింది.
18న ఉప్పల్ స్టేడియం వేదికగా టీం ఇండియాతో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం.. న్యూజిలాండ్ టీం హైదరాబాద్ చేరుకుంది. ఇవాళ టీం ఇండియా కూడా హైదరాబాద్ చేరుకోనుంది. రేపు ఉప్పల్ స్టేడియంలో రెండు టీమ్స్ ప్రాక్టీసు చేయనున్నాయి.