ముంబై: కొత్త ఏడాదిని టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీతో షురూ చేసింది. శ్రీలంకతో ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో సూపర్ బౌలింగ్తో ఆకట్టుకుంది. లాస్ట్ ఓవర్లో 13 రన్స్ను కాపాడుకుని లంకేయులకు చెక్ పెట్టింది. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 2 రన్స్ తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0 లీడ్లో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 162/5 స్కోరు చేసింది. దీపక్ హుడా (23 బాల్స్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 41 నాటౌట్), ఇషాన్ కిషన్ (29 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), అక్షర్ పటేల్ (20 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 31 నాటౌట్) రాణించారు. తర్వాత లంక 20 ఓవర్లలో 160 రన్స్కు ఆలౌటైంది. కెప్టెన్ దసున్ షనక (27 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45) టాప్ స్కోరర్. శివం మావి 4 వికెట్లు తీశాడు. హుడాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్తో మావి, శుభ్మన్ గిల్ టీ20 డెబ్యూ చేశారు. ఇరుజట్ల మధ్య గురువారం పుణెలో రెండో టీ20 జరగనుంది.
హుడా జోరు..
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో 6, 4తో ఇషాన్ జోరు చూపెట్టగా, రెండో ఓవర్లో ఫోర్ కొట్టిన శుభ్మన్ గిల్ (7).. తర్వాతి ఓవర్లో ఔటయ్యాడు. దీంతో తొలి వికెట్కు 27 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. నాలుగో ఓవర్లో ఫోర్తో టచ్లోకి వచ్చిన సూర్యకుమార్ (7).. ఆరో ఓవర్లో వెనుదిరిగాడు. ఆ వెంటనే సంజూ శాంసన్ (5) చెత్త షాట్తో వికెట్ ఇచ్చుకోవడంతో ఇండియా 46/3తో కష్టాల్లో పడ్డది. ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (29) నిలకడగా ఆడాడు. 8వ ఓవర్లో వరుస ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్కు మళ్లీ ఊపు తెచ్చాడు. ఆపై, ఇషాన్ 6, 4 బాదడంతో సగం ఓవర్లకి ఇండియా స్కోరు 75/3కి చేరింది. కానీ 11వ ఓవర్లో హసరంగ.. ఇషాన్ను ఔట్ చేయడంతో నాలుగో వికెట్కు -31 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో దీపక్ హుడా మెరుగ్గా ఆడాడు. కానీ, 15వ ఓవర్లో పాండ్యా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్, హుడాతో పోటీపడ్డాడు. 16వ ఓవర్లో దీపక్ రెండు వరుస సిక్సర్లు, తర్వాతి ఓవర్లో మరో సిక్సర్తో జోరు పెంచాడు. ఆ వెంటనే అక్షర్ కూడా 4, 6, 4తో చెలరేగాడు. లాస్ట్ ఓవర్లో హుడా 6 , 4 కొట్టాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్కు 35 బాల్స్లోనే 68 రన్స్ జోడించడంతో ఇండియా మంచి టార్గెట్ నిర్దేశించింది. లంక బౌలర్లలో మధుషనక, తీక్షణ, చమిక కరుణరత్నే, ధనంజయ డిసిల్వా, వానిందు హసరంగ తలోవికెట్ తీశారు.
మావి అదుర్స్..
ఛేజింగ్లో లంక ఆరంభంలోనే తడబడింది. తన తొలి పోరులోనే యంగ్ పేసర్ శివం మావి మంచి లైన్ అండ్ లెంగ్త్తో లంకేయులను దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో నిశాంక (1), ధనంజయ్ డిసిల్వా (8)ను ఔట్ చేసి ఝలక్ ఇచ్చాడు. ఓ ఎండ్లో కుశాల్ మెండిస్ (28) పోరాడినా.. రెండో ఎండ్లో అసలంక (12), రాజపక్స (10) ఫెయిలవడంతో లంక 68 రన్స్కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ షనక, హసరంగ (21) అనూహ్యంగా చెలరేగారు. చహల్ బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టిన హసరంగ.. ఆరో వికెట్కు 40 రన్స్ జోడించి మావి (15వ ఓవర్) బౌలింగ్లో ఔటయ్యాడు. లంకకు 30 బాల్స్లో 53 రన్స్ అవసరమైన టైమ్లో షనక భారీ షాట్లు కొట్టాడు. కానీ,17వ ఓవర్లో ఉమ్రాన్ అతడిని ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆవెంటనే మహీశ్ తీక్షణ (1)ను మావి ఔట్ చేశాడు. కానీ, 19వ ఓవర్లో హర్షల్ 16 రన్స్ లీక్ చేశాడు. లాస్ట్ ఓవర్లో లంకకు 13 రన్స్ అవసరం అవగా.. పాండ్యా అనూహ్యంగా స్పిన్నర్ అక్షర్తో బౌలింగ్ చేయించాడు. మూడో బాల్కు కరుణరత్నే (23 నాటౌట్) సిక్స్ కొట్టి టెన్షన్ రేపాడు. చివరి రెండు బాల్స్కు కాసున్ రజిత (5), మధుషనక (0) రనౌట్ కావడంతో లంకకు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 162/5 (దీపక్ హుడా 41*, ఇషాన్ 37, అక్షర్ 31*, ధనంజయ డిసిల్వా 1/6),
శ్రీలంక: 20 ఓవర్లలో 160 ఆలౌట్ ( షనక 45, కుశాల్ మెండిస్ 28, శివం మావి 4/22).