
వెస్టిండీస్ టూర్లో ఇండియా వరుసగా రెండో సిరీస్ సొంతం చేసుకుంది. తొలుత టెస్టు సిరీస్లో కరీబియన్లను పడగొట్టిన మన జట్టు వన్డే సిరీస్నూ గెలిచింది. ఈ ఫార్మాట్లో విండీస్పై వరుసగా 13వ సిరీస్ను ఖాతాలో వేసుకున్న టీమిండియా అదే జోరుతో టీ20లకు రెడీ అయింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి జరిగే తొలి పోరులో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్నూ పట్టేసి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది.
తరౌబా (ట్రినిడాడ్): రెండో వన్డేలో తగిలిన షాక్ నుంచి వెంటనే కోలుకున్న టీమిండియా ఆల్రౌండ్ పెర్ఫామెన్స్తో అదరగొట్టింది. బ్యాటర్లకు తోడు బౌలర్లూ పంజా విసరడంతో మూడో వన్డేలో 200 రన్స్ తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. దాంతో, మూడు వన్డేల సిరీస్ను 2–1తో గెలిచింది. మంగళవారం అర్ధరాత్రి ముగిసిన ఈ పోరులో ఇండియా ఇచ్చిన 352 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్ (3/30) దెబ్బకు విండీస్ 35.3 ఓవర్లలో 151 రన్స్కే కుప్పకూలింది. గుడకేశ్ మోతీ (39 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ (2/25) రెండు వికెట్లు తీశాడు. తొలి స్పెల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ముకేశ్ కుమార్.. బ్రెండన్ కింగ్ (0), కైల్ మేయర్స్ (4), షై హోప్ (5) వికెట్లు పడగొట్టడంతో కరీబియన్ టీమ్ 17/3తో ఎదురీత మొదలు పెట్టింది. ఆపై కేసి కార్టీ (6)ని ఉనాద్కట్ ఔట్ చేశాడు. శార్దూల్ విజృంభించడంతో విండీస్ మిడిలార్డర్ కూడా కుదేలైంది.
హెట్మయర్ (4), రొమారియో షెఫర్డ్ (8)ను అతను వెనక్కు పంపడంతో 14 ఓవర్లకే 50/6తో నిలిచిన విండీస్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. కాసేపు పోరాడిన అతానజె (32), కరియా (19)స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యారు. చివర్లో మోతీ, అల్జారీ జోసెఫ్ (26) ఎనిమిదో వికెట్కు 55 రన్స్ జోడించడంతో విండీస్ స్కోరు 150 దాటింది. తొలుత ఇండియా 50 ఓవర్లలో 351/5 స్కోరు చేసింది. గిల్ (85), ఇషాన్ (77), హార్దిక్ (70 నాటౌట్), శాంసన్ (51) రాణించారు. గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఇషాన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
తిలక్ వర్మకు చాన్స్!
వన్డే సిరీస్ గెలిచిన 48 గంటల్లోనే ఇండియా టీ20 మోడ్లోకి రానుంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం రాత్రి జరిగే తొలి మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్ విండీస్తో పోటీ పడనుంది. వన్డేల మాదిరిగా ఈ ఫార్మాట్లోనూ యంగ్స్టర్స్కు అవకాశాలు ఇవ్వనుంది. ఐపీఎల్లో అదరగొట్టి ఇండియా టీమ్లోకి వచ్చిన హైదరాబాదీ తిలక్ వర్మతో పాటు టాలెంటెడ్ యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ను మేనేజ్మెంట్ పరీక్షించనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్లో యశస్వి సూపర్ పెర్ఫామెన్స్ చేయగా.. చాన్స్ వస్తే తన టీ20 పవర్ హిట్టింగ్ను ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్లాలని తిలక్ వర్మ సైతం ఆత్రుతగా ఉన్నాడు. మరోవైపు అగార్కర్ చీఫ్ సెలెక్టర్ అయిన తర్వాత జరిగిన తొలి సెలెక్షన్ కమిటీ మీటింగ్లోనే కీపర్ సంజు శాంసన్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఈ లెక్కన అతనికి ఈ సిరీస్లోనూ చాన్సు రానుంది.
దాన్ని సద్వినియోగం చేసుకుంటే వరల్డ్ కప్ టీమ్లో బ్యాకప్ కీపర్ రేసులో శాంసన్ ముందుకొస్తాడు. వన్డేల్లో చాన్స్ రాని చహల్ తో పాటు మరో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఈ సిరీస్లో బరిలోకి దిగడం లాంఛనమే కానుంది. హ్యాట్రిక్ ఫిఫ్టీలతో ఇషాన్ జోరు మీదుండగా, మూడో వన్డేలో మెరుపులతో గిల్, హార్దిక్ కూడా టచ్లోకి వచ్చారు. కానీ, మూడు ఇన్నింగ్స్ల్లోనూ ఆకట్టుకోలేకపోయిన సూర్యకుమార్ తనకిష్టమైన టీ20ల్లో అయినా బ్యాట్ పవర్ చూపిస్తాడేమో చూడాలి. ఈ సిరీస్లో వైస్ కెప్టెన్ కూడా అయిన సూర్యపై అదనపు బాధ్యత కూడా ఉంది. ఇక, మూడో వన్డేలో మెప్పించిన పేసర్ ముకేశ్తో పాటు అర్ష్దీప్, అవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలు పంచుకునే చాన్సుంది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సత్తా చాటి టీమ్లో ప్లేస్ ఖాయం చేసుకోవాలని యంగ్ స్టర్స్ ఆశిస్తున్నారు.
విండీస్ కాస్త బలంగా
టెస్టు, వన్డే సిరీస్లు కోల్పోయిన వెస్టిండీస్ తాము కొంత బలంగా ఉన్న ఈ ఫార్మాట్లో సత్తా చాటాలని ఆశిస్తోంది. ఈ సిరీస్ కోసం కీపర్ షై హోప్, పేసర్ ఒషేన్ థామస్ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకుంది. వన్డే సిరీస్ ఆడని సీనియర్ ప్లేయర్ హోల్డర్ కూడా బరిలోకి దిగుతున్నాడు. రోవ్మన్ పావెల్ కెప్టెన్సీలోని కరీబియన్ టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంది.