
- అసెస్మెంట్ ఇయర్ 2021–22లో రూ.100 కోట్ల కంటే ఎక్కువ జీతాన్ని రిపోర్ట్ చేసిన వారు 16 మంది
- అంతకు ముందు ఏడాదిలో ఎనిమిది మందే
- పెరిగిన ట్యాక్స్ పేయర్ల ఆదాయం
న్యూఢిల్లీ: జీతాలతోనే కోటీశ్వరులుగా మారుతున్నవారు పెరుగుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం అసెస్మెంట్ ఇయర్ 2021–22 (ఫైనాన్షియల్ ఇయర్ 2022–23) లో రూ.100 కోట్ల కంటే ఎక్కువ శాలరీని రిపోర్ట్ చేసిన వారు 16 కి పెరిగారు. ఇది అంతకు ముందు అసెస్మెంట్ ఇయర్తో పోలిస్తే డబుల్ అని చెప్పాలి. కేవలం జీతాలతో బిలియనీర్ల క్లబ్లలో వీరు జాయిన్ అవ్వడం విశేషం. ఈ 16 మంది మొత్తం శాలరీ రూ. 2,569 కోట్లకు పైనే ఉందని ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఒక్కొక్కరు సగటున రూ.160.57 కోట్ల ఆదాయాన్ని సంపాదించారని తెలిపింది. కానీ, అసెస్మెంట్ ఇయర్ 2019–20 లో ఇటువంటి వారి సంఖ్య 20 గా నమోదయ్యింది.
589 రిటర్న్స్..రూ.13 లక్షల కోట్లు
అసెస్మెంట్ ఇయర్ 2021–22 లో 6.75 కోట్ల ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యాయని ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ రిటర్న్స్లో 589 అసెసీలు (శాలరీ ఆదాయంతో పాటు ఇతర ఆదాయం పొందేవారు కలిపి) సుమారు రూ.500 కోట్ల ఎక్కువ ఆదాయాన్ని రిపోర్ట్ చేశారు. వీరు ఫైల్ చేసిన మొత్తం గ్రాస్ ఇన్కమ్ రూ.13 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఫైల్ అయిన, ప్రాసెస్ అయిన ఐటీ రిటర్న్ల డేటా ఆధారంగా ఈ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఒకటి కంటే ఎక్కువసార్లు ఫైల్ అయిన రిటర్న్లను జాగ్రత్తగా విశ్లేషించి ఈ డేటా విడుదల చేశామని పేర్కొంది.
పెరుగుతున్న ఐటీ రిటర్న్స్..
గత కొన్నేళ్లుగా ఐటీఆర్ ఫైలింగ్స్ పెరుగుతున్నాయని ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అసెస్మెంట్ ఇయర్ 2013–14 లో 3.36 కోట్ల ఐటీఆర్లు ఫైల్ అవ్వగా, అసెస్మెంట్ ఇయర్ 2021–22 లో 6.37 కోట్లు ఫైల్ అయ్యాయి. అసెస్మెంట్ ఇయర్ 2022–23కు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఏకంగా 7.41 కోట్ల రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. 54 లక్షల మంది మొదటిసారిగా రిటర్న్స్ను ఫైల్ చేయడం విశేషం. ప్రభుత్వ చర్యలతో ట్యాక్స్ కడుతున్నవారు పెరుగుతున్నారనడానికి ఇదొక నిదర్శనమని ఐటీ డిపార్ట్మెంట్ చెబుతోంది. గత కొన్నేళ్లుగా ఇండివిడ్యువల్స్ (పెన్షనర్లు, ఉద్యోగులు..) ట్యాక్స్పేయర్లు పెరుగుతున్నారని, వివిద ట్యాక్స్ శ్లాబ్లలో వీరు ఫైల్ చేస్తున్న రిటర్న్లు పెరుగుతున్నాయని వివరించింది.
హైలైట్స్..
1.గ్రాస్ ఇన్కమ్ రూ.5 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ రిటర్న్లు అసెస్మెంట్ ఇయర్ 2013–14 లో 2.62 కోట్లుగా రికార్డయ్యాయి. అసెస్మెంట్ ఇయర్ 2021–22 లో ఈ నెంబర్ 3.47 కోట్లకు చేరుకుంది. ఇది 32 శాతం గ్రోత్కు సమానం. రూ. 5 లక్షల లోపు ఉన్న ఇన్కమ్లో ట్యాక్స్ మినహాయింపు ఉన్న ట్యాక్స్ శ్లాబ్ కూడా ఉంది. ఈ శ్లాబ్ కింద ఉన్న చాలా మంది రిటర్న్స్ ఫైల్ చేసి ఉండకపోవచ్చు.
2. పైన పేర్కొన్న టైమ్లోనే గ్రాస్ ఇన్కమ్ రూ.5 నుంచి రూ.10 లక్షల ఉన్న ఐటీ రిటర్న్లు 295 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు ఉన్న రిటర్న్లు 291 శాతం పెరిగాయి. దీనిని బట్టి ఇండివిడ్యువల్స్ గ్రాస్ ఇన్కమ్ పెరుగుతోందని చెప్పొచ్చని ఐటీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
3. ఫైల్ అయిన రిటర్న్స్లోని మొత్తం గ్రాస్ ఇన్కమ్లో టాప్ వన్ పర్సంట్ ట్యాక్స్ పేయర్ల (బిలియనీర్లు, మిలియనీర్లు) వాటా 2013–14 అసెస్మెంట్ ఇయర్లో 15.9 శాతం ఉంటే, 2021–22 అసెస్మెంట్ ఇయర్లో 14.6 శాతానికి తగ్గింది. అలానే తక్కువ ఆదాయాన్ని రిపోర్ట్ చేసే కింది స్థాయి 25 శాతం మంది ట్యాక్స్పేయర్ల వాటా 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది. మధ్య స్థాయి ఆదాయాన్ని ప్రకటించే వారి వాటా 75.8 శాతం నుంచి 77 శాతానికి చేరుకుంది.
4. ఇండివిడ్యువల్ ట్యాక్స్పేయర్లు రిపోర్ట్ చేసిన సగటు గ్రాస్ ఇన్కమ్ రూ.4.5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెరిగింది. ఇది 56 శాతం గ్రోత్కు సమానం. టాప్ వన్ పర్సంట్ ట్యాక్స్పేయర్లు రిపోర్ట్ చేసిన గ్రాస్ ఇన్కమ్ 42 శాతం, కిందిస్థాయిలోని 25 శాతం ట్యాక్స్పేయర్లు రిపోర్ట్ చేసిన గ్రాస్ ఇన్కమ్ 58 శాతం పెరిగింది.
5. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్థిక సంవత్సరం 2013–14 లో రూ.6.38 లక్షల కోట్లు ఉంటే 2022–23 లో రూ.16.61 లక్షల కోట్లకు పెరిగింది. అసెస్మెంట్ ఇయర్ 2013–14 తో పోలిస్తే అన్ని సెగ్మెంట్లలోని ఇండివిడ్యువల్స్ గ్రాస్ ఇన్కమ్ పెరిగినట్టు తెలుస్తోందని ఐటీ డిపార్ట్మెంట్ పేర్కొంది.