ఓట్లను కాపాడుకునే బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలదే: ఎంపీ వంశీకృష్ణ

 ఓట్లను  కాపాడుకునే  బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలదే: ఎంపీ వంశీకృష్ణ

సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకే బెంగాల్ ఎన్నికల తర్వాత 4 వేల ఈవీఎంలను తగులబెట్టారని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ  వంశీకృష్ణ. బాబాసాహెబ్ అంబేద్కర్ 70 ఏళ్ల క్రితం మనకు ప్రసాదించిన పవిత్రమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత బూత్ స్థాయి కార్యకర్తలపైనే ఉందని పిలుపునిచ్చారు.

మంచిర్యాల, గోదావరిఖని వేదికగా జరిగిన కాంగ్రెస్ బీఎల్ ఓల సమావేశంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలపై ఆయన నిప్పులు చెరిగారు.పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ.. పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందే 'ఓట్ చోర్.. గద్దె చోడ్' అంటూ ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 

గడిచిన పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల జిల్లాకు తెచ్చిన నిధులెన్ని అని ప్రశ్నిస్తూ సవాల్ విసిరారు వంశీకృష్ణ. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి, ఇక్కడి ప్రజలను, రాష్ట్రాన్ని పాకిస్తాన్‌తో పోలుస్తూ కించపరుస్తుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణను కించపరిస్తే ఖబడ్డార్ అని హెచ్చరించారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు 8 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని.. పార్లమెంట్‌లో గళం విప్పి మన నిధుల కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు.

ఇక యువతను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై వంశీకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీపై 30 కేసులు ఉంటేనే లీడర్ అవుతావు అంటూ యువతను జైళ్లపాలు చేసేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మీ పిల్లలు మాత్రం సూట్లు వేసుకుని, అమెరికా పోయి, ఇంగ్లీష్‌లో మాట్లాడాలా? మన పేద పిల్లలు జైళ్లలో ఊచలు లెక్కపెట్టాలా?' అని నిలదీశారు.

కేసులు ఉంటే ఉద్యోగాలు రావని, పెళ్లిళ్లు కావని.. యువత భవిష్యత్తును నాశనం చేయొద్దని హెచ్చరించారు. సిగ్గుంటే గ్రౌండ్‌లోకి వచ్చి యువతకు ఉద్యోగాలు వచ్చేలా పనిచేయాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏటిసీలు, టామ్‌కామ్ (Tomcom) ద్వారా యువతకు జర్మనీలో ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తూ, ఏడాదికి 35,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని.. యువతను అభివృద్ధి బాటలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు.

గతంలో సింగరేణి సంస్థను బీఎఫ్ ఐఆర్ (BFIR) నుంచి కాపాడిన అమరజీవి కాకా వెంకటస్వామి  స్ఫూర్తితో.. సింగరేణి సంస్థను కాపాడుతూ కార్మికులకు అండగా ఉంటామని వంశీకృష్ణ మాటిచ్చారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 10 వేల రూపాయల పెన్షన్ వచ్చేవరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.